– రెండో విడతలో 85.76 శాతం పోలింగ్ నమోదు
– మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
– రాత్రి వరకు కొనసాగిన లెక్కింపు
– ముందంజలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు
– ద్వితీయ, తృతీయస్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు
– సత్తా చాటిన స్వతంత్ర అభ్యర్థులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వోట్ల లెక్కింపు ఆదివారం రాత్రి వరకు ఉత్కంఠగా సాగింది. ఉదయం నుంచి కొనసాగిన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటతో ముగియగా అప్పటివరకు క్యూలో ఉన్న ప్రతి వోటరుకు వోటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా వార్డు సభ్యుల వోట్ల లెక్కింపు చేపట్టి ఆ తర్వాత సర్పంచ్ స్థానాల ఫలితాలను వెల్లడించారు. రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ దశలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం వేలాది మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. గ్రామస్థాయి పాలనలో కీలకమైన సర్పంచ్ పదవి రాజకీయ జీవితానికి తొలి మెట్టు కావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోయింది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో దశలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్థానంలో నిలిచాయి. కాగా, రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 1,842మంది విజయం సాధించారు.
ఏ పార్టీ మద్దతుదారులు ఎంతమంది గెలిచారో ఈ కింద చూడండి.
కాంగ్రెస్ -1,842
బీఆర్ఎస్ – 990
బీజేపీ – 205
స్వతంత్రులు -520





