– రాహుల్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
– ఎస్ఐఆర్కు అనుకూలమో.. కాదో చెప్పాలని వ్యాఖ్య
న్యూదిల్లీ, నవంబర్ 5: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పును బీజేపీ తారుమారు చేసిందని, 25 లక్షల వోట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఆయన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది. హర్యానాలో వోటర్ల జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని వివరించింది. హర్యానా ఎన్నికల ఫలితాన్ని బీజేపీ చోరీ చేసిందని, గెలుపు కోసం ఎన్నికల కమిషన్తో ఆ పార్టీ కుమ్మక్కయిందని రాహుల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈసీ తాజా వివరణ ఇచ్చింది. హర్యానాలో కాంగ్రెస్కు దక్కాల్సిన అద్భుత విజయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’ జరిగిందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. దీనిపై ఈసీ స్పందిస్తూ, 90 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 22 ఎలక్షన్ పిటిషన్లు మాత్రమే హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్టు తెలిపింది. బూత్లలో ఉన్న కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్ల పాత్రను ఈసీ నిలదీసింది. ఆ పార్టీ పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు? వోటరు ఎవరైనా అప్పటికే వోటు వేసినట్టు అనుమానం వచ్చినా, వోటరు ఐడెంటిటీపై అనుమానం వొచ్చినా అప్పుడే అభ్యంతరం వ్యక్తి చేసి ఉండొచ్చని పేర్కొంది. పౌరసత్వ వెరిఫికేషన్తో పాటు డూప్లికేట్లను, చనిపోయిన వారిని, చిరునామా మార్చుకున్న వోటర్లను తొలగించేందుకు చేపట్టిన ఎస్ఐఆర్ను రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ఈసీ ప్రశ్నించింది. కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తలేదని ప్రశ్నించింది. ఒకే పేరు పదేపదే రాకుండా నిరోధించేందుకు రివిజన్ జరిగినప్పుడు కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు అభ్యంతరం చెప్పి ఉండవచ్చని పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకూ బిహార్లో ఎస్ఐఆర్ సమయంలో కూడా కాంగ్రెస్ ఎందుకు అప్పీల్ చేయలేకపోయిందో చెప్పాలని పేర్కొంది. హర్యానాలో 25 లక్షల వోట్ల చోరీ జరిగిందని, టాప్-5 ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పినప్పటికీ బీజేపీ గెలిచిందని న్యూదిల్లీలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో రాహుల్ తెలిపారు. ఒక నియోజకవర్గంలో ఒక ఫోటోతో వంద వోట్లున్నాయని, అనేక బూతులలో ఫేక్ వోట్లున్నాయని, అక్రమాలు బయటకు రావద్దని ఎన్నికల సంఘం సీసీటీవీ ఫుటేజ్ను డిలీట్ చేసిందని ఆరోపించారు. బ్రెజిలియన్ మోడల్, యూపీ బీజేపీ ఓటర్లు, డూప్లికేట్ వోటర్లు, వోటర్ల తొలగింపుతో హర్యానాలో గెలిచారని అన్నారు. యూపీ, హర్యానాలో వేల సంఖ్యల్లో డూప్లికేట్ వోటర్లున్నారని, యూపీలో వోటు వేసే వ్యక్తికి హర్యానాలో కూడా వోటు ఉందని తెలిపారు. బిహార్లోనూ వోట్ల చోరీ జరుగుతుందని, అక్కడ ఎన్నికల తరువాత వోట్ల చోరీ అంశాన్ని బయటపెడతామని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





