గతేడాది కంటే 1.47 శాతం అధికం
94.26 శాతంతో బాలికలదే పైచేయి
మహబూబాబాద్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్
జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఫలితాలు విడుదల చేసిని సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రవీంద్రభారతిలో విడుదల చేశారు. 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరిగిన పది పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి సీఎం విడుదల చేశారు. ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఈసారి 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. 94.26 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత కాగా.. 91.32 శాతం మంది బాలురు పాసయ్యారు.
అత్యధికంగా గురుకుల పాఠశాలల్లో 98.7 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం విద్యార్థులు పాసయ్యారు. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లను ఎస్ఎస్సీ బోర్డు ఇచ్చింది. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరుగుతాయని ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. ఫీజు చెల్లింపునకు తుది గడువు మే 16గా నిర్ణయించారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు మే 15వరకు అవకాశం కల్పించారు. ఇందుకోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించి రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి రీవెరిఫికేషన్కు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది రెండు ప్రైవేటు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
ఈ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 99.29శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. వికారాబాద్లో అతి తక్కువగా 73.97శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతిలో ఈసారి కొత్తగా సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడింగ్ కూడా ఇచ్చారు. ఈ విధనంగా మార్కుల మెమోలు జారీ చేయనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ పొందుపరిచారు విద్యార్థి పాసయ్యారా..? ఫెయిల్ అయ్యారా…? అనేది మాత్రమే ఫలితాలలో కనిపిస్తుంది. ఇంకా బోధనేతర కార్యక్రమాల (కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. ప్రస్తుతం సిబిఎస్ఇలో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రిస్తున్నారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రించారు.