2030 ‌నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌

గ్రీన్‌ ఎనర్జీలో లక్ష కోట్ల పెట్టుబడికి కంపెనీల ఆసక్తి
అద్భుతమైన గ్రీన్‌ ‌పవర్‌ ‌పాలసీ ప్రవేశపెట్టాం..
రాష్ట్రానికి తక్కువ ధరకు కాలుష్య రహితంగా  విద్యుత్‌
‌శాసన మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 17 : రాష్ట్రానికి తక్కువ ధరతో కాలుష్య రహితంగా విద్యుత్‌ ‌ను అందించడమే లక్ష్యంగా సమగ్ర గ్రీన్‌ ‌పవర్‌ ‌పాలసీని ప్రజా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్‌ ‌పవర్‌ ‌పాలసీకి పెట్టుబడుదారులు ఆకర్షితులై 80,000 నుంచి లక్ష కోట్ల వరకు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని తెలిపారు.  ఇప్పటికే కొన్ని కంపెనీలు ఎంవోయూలు చేసుకున్నాయని తెలిపారు. తెలంగాణ క్లీన్‌ అం‌డ్‌ ‌గ్రీన్‌ ఎనర్జీ పాలసీపై కౌన్సిల్‌ ‌లో  ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌కల్వకుంట్ల కవిత, భానుప్రసాద్‌ అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ ‌రంగంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ గత పదేళ్లుగా ఈ రంగంలో ఒక్క పాలసీ లేదని ఆరోపించారు. 2030 నాటికి 20,000 మెగావాట్లు, 2040 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. సౌర, పవన, గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌వంటి విభాగాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. గ్రీన్‌ ‌పవర్‌ ‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సింగిల్‌ ‌విండో పద్ధతుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నాం. స్టాంప్‌ ‌డ్యూటీని రియింబర్స్ ‌మెంట్‌ ‌చేస్తున్నాం. నాలా కన్వర్షన్‌ ‌సులభతరం చేశామని తెలిపారు. రోజురోజుకు విద్యుత్‌ ‌డిమాండ్‌ ఊహించిన రీతిలో పెరుగుతుంది.
దానిని అందుకునేందుకు ప్రభుత్వ ఖాలీ భూములు, దేవాదాయ శాఖ ఖాలీ భూముల్లో సాగునీటి శాఖలో సోలార్‌, ‌ఫ్లోటింగ్‌ ‌సోలార్‌ ‌ద్వారా గ్రీన్‌ ‌పవర్‌ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళలతో వెయ్యి మెగావాట్ల సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తికి జెన్కోతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ప్రభుత్వ ఖాలీ భూములను స్వయం సహాయక సంఘాల మహిళలకు లీజుకు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళ సంఘాలు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ ‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని  తెలిపారు. ఈ రంగాల్లో యువతను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు బ్యాంకుల సహకారంతో స్వయం ఉపాధికి గ్రీన్‌ ‌పవర్‌ ‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ గ్రీన్‌ ‌పవర్‌ ఉన్నా అంది పుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా ఇటీవల రాజస్థాన్‌ ‌ప్రభుత్వం సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.
ఈవీలకు ప్రోత్సాహం
రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ ‌వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రిజిస్ట్రేషన్‌ ‌లో టాక్సీ ఫ్రీ చేశామని ఫలితంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ ‌వాహనాల విక్రయాలు పెరిగాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. దావోస్‌ ‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు పర్యటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రానికి వొచ్చారు. వారు క్షేత్రస్థాయిలో సర్వే చేసుకుంటున్నారు. సర్వే తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,938 మెగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌ ఉత్పత్తి జరుగుతుందని 2040 నాటికి 40 వేల మెగావాట్లు రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తామని తెలిపారు.
దూర ప్రయాణం చేసే వారిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ముందుకు వొస్తే ఎలక్ట్రిక్‌  ‌చార్జింగ్‌ ‌స్టేషన్లు పెట్టుకునేందుకు అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు.
తీవ్ర వాతావరణ కాలుష్యం మూలంగా దిల్లీ నగర ప్రజలు ఒక సీజన్లో మూడు నెలల పాటు వలస వెళ్లి పోతున్నారు. ఆ పరిస్థితి హైదరాబాద్‌ ‌కు రాకుండా చూడాలని ఎలక్ట్రిక్‌, ‌బ్యాటరీ బేస్డ్ ‌బస్సులు ప్రవేశ పెడుతూ డీజిల్‌ ‌బస్సులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌ ‌సిటీలో కొత్తగా డీజిల్‌ ఆటోలకు అనుమతి ఇవ్వడం లేదు. బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కాలుష్య కార్యక్రమం నగరం నుంచి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వెలుపలకు తరలించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. గ్రీన్‌ ‌పవర్‌ ‌పాలసీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరితే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన గ్రీన్‌ ‌పవర్‌ ‌పాలసీకి సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్లో ఉందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *