మళ్లీ ప్రమాద స్థాయికి చేరుకోనున్న గోదావరి

 నేటి రాత్రికి 56 అడుగులు చేరుకునే అవకాశం.
ముంపు ప్రాంత ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాల తరలి వెళ్లాలి : కలెక్టర్ ప్రియాంక అలా
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 27:  గోదావరికి ఎగువ నుండి వస్తున్న వరదలు వల్ల నేటి రాత్రికి 56 అడుగులకు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు.  గురువారం సాయంత్రం బూర్గంపాడు మండలంలో ముంపుకు గురయ్యే సారపాక ఎస్టీ కాలనీ, నాగినేనిప్రోలు ఎస్టీ కాలనీ, బూర్గంపాడు ఎస్సి కాలనిలో విస్తృతంగా పర్యటించారు. ఎస్ఆర్ఎస్పి, కడెం ప్రాజెక్టుల నుండి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు చెప్పారు. ప్రస్తుతం వస్తున్న 12
లక్షలకు క్యూసెక్కులకు  అదనంగా 8 లక్షలు వస్తున్నందున  గురువారం (నేటి) రాత్రి 10 గంటల తరువాత గోదావరి అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. రాత్రి సమయంలో ప్రజలు నిద్రలో ఉంటారు కాబట్టి తరలింపు ప్రక్రియకు ఇబ్బందులు వస్తాయని, అందుకే ఏమాత్రం  జాప్యం చేయక  తక్షణమే ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని  సూచించారు.  తక్షణమే తరలింపు ప్రక్రియ చేపట్టాలని  రెవెన్యూ, పంచాయతిరాజ్, పోలీస్ అధికారులను ఆదేశించారు.  చిన్నా, పెద్ద, తేడా లేకుండా మీడియా, అలాగే ప్రజా ప్రతినిధులు సైతం సురక్షిత ప్రాంతాలకు
తరలిరావాలని చెప్పారు. కొంత మంది   అత్యుత్సాహంతో సెల్ఫీలు దిగేందుకు జలాశయాల వద్దకు వస్తున్నారని,  ప్రమాదం పొంచిఉన్నందున అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. యంత్రాంగం సలహాలు, సూచనలు ధిక్కరిస్తే అలాంటి వారిపై అత్యవసర సేవలు ఉల్లంఘనకు
పాల్పడినట్లుగా పరిగణించి పోలీస్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు డిపిఓ రమాకాంత్,  తహసిల్దార్ భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *