మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి.మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉంది. దీని ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది భారత వాతావరణం శాఖ. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఎండ ఉన్నప్పటికీ.. భూమి వేడెక్కినప్పుడు బలమైన మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తుంటాయి. ఇటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాతో పాటు కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *