మెచ్చుకున్న నోళ్లతోనే పుచ్చి పోయిన మాటలు
మొన్నటి వరదల స్థాయి 108 మీటర్లు దాటింది..ఇది ప్రకృతి వైపరీత్యం
ప్రాజెక్టులు పాడు కావాలి, తెలంగాణ బాగు పడొద్దు..బీజేపీ దుష్ట పన్నాగం
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి హరీష్ రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‘‘ప్రశ్నించక పోతే సై ప్రశ్నిస్తే నై అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉంది…..కేంద్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని కేసీఆర్ నిలదీస్తుంటే బీజేపీ నేతలకు కడుపుమండుతుంది..అని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం కేంద్ర మంత్రి షేకావత్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారు.’’ అని ఖండిస్తూ గురువారం మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘‘అంతకు ముందు మెచ్చుకున్న నోళ్లతోనే పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారు…..కాళేశ్వరానికి కితాబిచ్చిన వాళ్లే ఇపుడు ఎదో మతలబు ఉందంటున్నారు. ఒకసారి ఫ్లాష్ బాక్లోకి వెళ్ళండి..మీ మతిమరుపును పరీక్షించుకోండి అని హితవు పలికారు. పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరం చెప్పిన నిజాలను ఇపుడు అబద్దాలుగా ప్రచారం చేస్తున్నారంటే చట్ట సభలు బీజేపీకి ఎంత చులకనగా మారాయో అర్థమవుతుంది అంటూ..అవినీతి జరిగితే అనుమతులు ఎలా ఇచ్చారు…మీకు నచ్చినప్పుడు నీతి… నచ్చనపుడు అవినీతా..కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చింది మీరే. అప్పులు ఇచింది మీరే..పీఎం మోడీ గతంలో కేసీఆర్ తీరును మెచ్చుకోలేదా..అని ప్రశ్నించారు .’’ నితిన్ గడ్కరీ కాళేశ్వరాన్ని తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అన్నారు….కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతం అన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులివ్వడాన్ని గట్టిగా సమర్దించారు. ఇది తెలంగాణకు లాభదాయక ప్రాజెక్టు..రాజీవ్ శర్మ కాళేశ్వరం అప్పులను సద్వినియోగం చేసుకుంటున్న తీరును ప్రశంసించారు. దేశానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఆదర్శమని చెప్పారు.
ఇది ఇంజనీరింగ్ అద్భుతం అని మెచ్చుకున్నారు. సమయానికి ముందే ప్రాజెక్టు పూర్తయిందని కితాబిచ్చారు(మోడీ, గడ్కరీ,మసూద్ హుస్సేన్, రాజీవ్ వీడియోలను ప్రదర్శించారు)..అందరి మాటలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాయి..కేవలం మేము చెప్పినవి కాదు..ఆరోజేమో కాళేశ్వరం గ్రోత్ ఇంజిన్..మరి ఈ రోజు ఎందుకు బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు..కేసీఆర్ మోడీ తీరును తప్పు బడుతున్నందుకే బీజేపీ కాళేశ్వరంపై మాట మార్చింది..22 జులై 2021న కేంద్రమంత్రి విశ్వేశ్వర్ తుడు కాళేశ్వరంలో అవినీతి జరగలేదని పార్లమెంటు సాక్షిగా చెప్పారు..ఇప్పటి మంత్రి షేకావత్ కూడా పార్లమెంటు వేదికగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదన్నారు..ఇపుడు రాజకీయం కోసమే బీజేపీ విమర్శలు..గోదావరికి 1986లో అత్యధిక వరద వొచ్చింది..107.05 మీటర్ల మేర వరద ప్రవహించింది..ఆ రికార్డును మొన్న గోదావరి వరదలు అధిగమించాయి..మొన్నటి వరదల స్థాయి 108 మీటర్లు దాటింది..ఇది ప్రకృతి వైపరీత్యం..ఒక ప్రత్యేక పరిస్థితి. ఏం చేస్తాం..ఈ వరద గతంలో 1986లో నమోదైన అత్యధిక వరద కంటే ఎక్కువగా వొచ్చింది…ఈ వరద పరిమాణం 29 లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది…1986లో కాళేశ్వరం వద్ద సిడబ్ల్యుసి వాళ్ళు నమోదు చేసిన అత్యధిక వరద మట్టం 107.05 మీటర్లు …ఈ మాట్టాన్ని పరిగణనలోకి తీసుకునే మెడిగడ్డ బ్యారేజి, కరకట్టలు పంప్ హౌజ్ రేగులేటర్ నిర్మించడం జరిగింది. ఈ ఏడాది గోదావరి అత్యధిక వరద మట్టం 108.2 మీటర్లగా నమోదైంది..అంటే 1986 మట్టం కన్నా 1.2 మీటర్లు అధికం..ఈ అసాధారణ వరద వల్లనే పంప్ హౌజ్ రెగ్యులేటర్ గేట్ల రబ్బర్ సీల్స్ ఊడిపోయినందువల్ల ఫోర్ బే లోకి పెద్ద ఎత్తున నీళ్లు వొచ్చాయి.
అదే సమయంలో అతి భారీ వర్షాలకు పంప్ హౌజే 220 కెవి సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ టవర్లు కూడా కూలిపోయాయి…అసాధారణ వర్షాలకు చందన పూర్ వాగు పొంగి అన్నారం బ్యారేజి రక్షణ కోసం నిర్మించిన కరకట్టపై నుంచి నీరు పొంగి పొర్లినందువల్ల అన్నారం పంప్ హౌజ్ నీట మునిగింది…అయినా అన్నారం పంప్ హౌజ్ మొత్తం సురక్షితంగా ఉంది. కన్నె పల్లి పంప్ హౌజ్లో బిగించిన 17 పంపుల్లో 3 మాత్రమే దెబ్బతిన్నాయి. నీట మునిగిన పంపులను పునరుద్ధరించే భాద్యత పూర్తిగా ఏజెన్సీ దే. రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ లేదు..పంప్ హౌజ్కి కరెంటు సరఫరా లేకపోవడం చేత ఇంజనీర్లు ఫోర్ బేలో నీటిని తోడేయ లేకపోయారు..దాంతో ఫోర్ బే రక్షణ గోడపై వత్తిడి పెరిగి కొంత భాగం కూలిపోయింది..దాంతో పంప్ హౌజే నీళ్లతో నిండింది…ఇది పూర్తిగా ప్రకృతి విపత్తు వల్ల జరిగింది అని స్పష్టంగా తెలిసిపోతున్నా..డిసైన్ లోపమని నాణ్యతా లోపమని సంకుచిత దివాలా కోరు రాజకీయాలు చేస్తున్నారు. 3 బ్యారేజీలు,16 జలాశయాలు, 21 పంప్ హౌజ్లు 98 కిలోమీటర్ల డెలివరీ పైపులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, భారీ విద్యుత్ సబ్ స్టేషన్లు ఇలా వందలాది కపోనెంట్స్ ఉన్న కాళేశ్వరంలో 2 పంప్ హౌజ్లు మాత్రమే నీట మునిగితే మొత్తం ప్రాజెక్టు యే నీట మునిగింది అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. 2009లో కృష్ణ నదికి ఆసాధారణ వరదలు వొచ్చినపుడు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం, కర్నూల్ పట్టణం, ఎస్ఎల్బిసి సొరంగం, కల్వకుర్తి పంప్ హౌజ్ నీట మునిగాయి.. అయితే వాటిని కొన్ని నెలల్లోనే పునరుద్ధరించుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు కూడా సెప్టెంబర్ నెలాఖరు నాటికి కాళేశ్వరం పంప్ హౌజ్ను పునరుద్ధరించి యథావిధిగా నీటిని ఎత్తి పోస్తాం..రెండు పంప్ హౌజ్లు తప్ప అన్నీ ఇపుడు కూడా పని చేస్తున్నాయి.
ఇప్పటికే 31 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రబీకి సిద్ధంగా ఉంచాం..మొన్న పంద్రాగస్టు నాడు కూడా ఎత్తి పోసిన నీళ్లకు త్రివర్ణ శోభ కల్పించాం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మూత పడాలన్న బీజేపీ ఆశలు ఆడియాశలు కాక తప్పవు. ప్రాజెక్టు పాడైతే బాగుండు అని బీజేపీ నేతలు కంటున్న కలలు కల్లలుగా మిగలక తప్పదు. రాక్షస ఆనందం పొందుతున్న బీజేపీకి నిరాశ తప్పదు. చవక బారు రాజకీయం చేస్తే పుట్టగతులు ఉండవు. ఎఫ్ఆర్బీఎమ్ ఆపితే కేసీఆర్ రైతు బంధు ఇవ్వరని బీజేపీ నేతలు అనుకున్నారు. కానీ కేసీఆర్ బీజేపీ ఎత్తులను చిత్తు చేసి రైతుబంధు ఇచ్చారు..ఉచిత కరెంటుకు కూడా బీజేపీ అడ్డుపడాలని చూసింది..నెలన్నర రోజుల్లోనే పాడైన పంపులు స్టార్ చేస్తాం..యాసంగి పంట కొనేందుకు కూడా కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి..తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం 200 శాతం పెరిగింది. ప్రాజెక్టులు లేనిదే ఇది సాధ్యమా..పంట ఉత్పత్తి గతంలో కన్నా 200 శాతం పెరిగింది. ఇది ప్రాజెక్టులు లేకుంటే సాధ్యమా…అపుడు తుమ్మలు మొలిసిన నెలల్లో ఇప్పుడు రెండు పంటలు పడుతున్నాయి..సిద్దిపేట జిల్లాలోలో ఐదు లక్షల టన్నుల ధాన్యం పడుతుంది. గతం లో 2 లక్షల టన్నులు కూడా పండలేదు…కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని అంటున్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే మార్చి 4 న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల కోసం మోటర్లను ఆన్ చేయడం వాస్తవం కాదా..పోయిన యాసంగిలో 11 లక్షల ఎకరాలకు కాళేశ్వరంతో మేలు జరిగింది. పెరిగిన సాగు.. పండిన పంటే, కేంద్రం పంట కొనకుండా చేతులెత్తేయడం కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనానికి సాక్ష్యం …కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం అన్ని అనుమతులిచ్చింది..కాస్ట్ బెనెఫిట్ రేషో అనుమతి కూడా 2018లో వొచ్చింది..టెక్నికల్ అనుమతి కూడా వొచ్చింది..ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వాళ్లే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కడుతున్నారు. కాళేశ్వరం కట్టిన వాళ్లకు సామర్థ్యం లేకుంటే పోలవరం ప్రాజెక్టును ఆ ఏజెన్సీకి ఎలా ఇచ్చారు..గుజరాత్లో హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటక, తమిళనాడుల్లో కూడా ఆ సంస్థ పని చేస్తుంది..సామర్థ్యం లేని కంపెనీకి కాళేశ్వరం పనులు ఇచ్చారని కేంద్రమంత్రిగా ఉండి ఎలా మాట్లాడుతారు. రాజకీయం కోసం బీజేపీ బురద జల్లే పనులు చేస్తుంది..నాణ్యతా లోపం, డిజైన్ లోపం వల్ల జరిగిన నష్టం కాదిది..ప్రకృతి విపత్తు వల్ల కలిగిన నష్టమిది. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు దేశంలో అనేక చోట్ల నష్టాలు జరిగిన సంఘటనలు కోకొల్లలు..వాటికి డిజైన్ లోపం అని ఆపాదించడం సరి కాదు…ప్రాజెక్టులు పాడు కావాలి తెలంగాణ బాగు పడొద్దు అనేది బీజేపీ దుష్ట బుద్ధి..అని మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాణిక్ రావు, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు.




