భోపాల్, జూన్ 28 : మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన తర్వాత కొందరు చిన్నారులు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బహరా గ్రామం వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న నదిలోకి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో 65 ఏళ్ల మహిళ, 18 ఏళ్ల వ్యక్తి సహా రెండు, మూడేళ్ల వయసు గల ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కొందరు చిన్నారులు కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి’ అని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. కాగా బాధితులంతా గ్వాలియర్ లోని బిల్హేటి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వారు తమ కుమార్తె వివాహం కోసం తికమ్ఘర్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.



