ముంబై, జూన్ 28 : మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో చాలా ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా నీట మునిగాయి. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అంధేరి ప్రాంతంలో అయితే కుంభవృష్టి కురిసింది.
దాంతో లోతట్టు ప్రదేశమైన అంధేరి సబ్వేలో భారీగా వరద నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు దూరం ఎక్కువైనా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొన్నది. దాంతో సబ్వేలో నిలిచిన నీటిని త్వరగా తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.