ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని ఆనాడు తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి కేసీఆర్
బషీర్ బాగ్ కాల్పులకు కారణం కేసీఆర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని ప్రకటించింది కాంగ్రెస్ కాగా..ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి చంద్రశేఖర్ రావు అని పిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అనాడు విద్యుత్ ఉద్యమంలో రైతులను చంపిన పాపం ముమ్మాటికీ కేసీఆర్దేనని అన్నారు.. రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ…ఊర్లో పెళ్లికి కుక్కల సందడిలాగా పుట్టలో పడుకున్న పాములు బయటకి వొచ్చి తనను నిందిస్తున్నారని మండిపడ్డారు. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నలు సంధించారని…కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు తాను క్లియర్గా వివరించినట్లు చెప్పారు. తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని కట్ చేసి ప్రచారం చేశారని ఆరోపించారు. ఐటీ మంత్రి అతి తెలివి ప్రదర్శించి చిల్లర వ్యవహారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్పై మరోసారి చర్చ జరగడం మంచిదే అని అన్నారు. కేటీఆర్ వొస్తే వ్యవసాయంలో ఇద్దరం పోటీ పడదామన్నారు. ఉచిత విద్యుత్ పెటేంట్ కాంగ్రెస్ పార్టీదేనని, సొంతంగా వ్యవసాయం చేసిన వ్యక్తిని తానని, వ్యవసాయం గురించి పూర్తిగా తనకు తెలుసునన్నారు. తాను దుక్కి దున్నిన వాడినని, కేటీఆర్ లాగా అమెరికాలో బాత్రూంలు కడగలేదని, తాను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకును, దలారీ కొడుకును కాదంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం హయంలో జరిగిన బషీర్ బాగ్ కాల్పుల సమయంలో కేసీఆర్ ఆ పార్టీలో కీలకంగా ఉన్నారని గుర్తు చేశారు. నాటి రైతుల పరిస్థితులను గమనించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం…ఉచిత విద్యుత్తో పాటు రైతులపై నమోదైన అన్ని కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఎన్నికయ్యారని చెప్పారు. ప్రమాణస్వీకారం సందర్భంగా…ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేశారని అన్నారు. ఉచిత్ విద్యుత్తో పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని రేవంత్ స్పష్టం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్నదని..వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫామ్ హౌస్లు, భూములు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ఉచిత విద్యుత్పై బీఆర్ఎస్తో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ పథకం తీసుకు వొచ్చిందే కాంగ్రెస్ అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకొని, వ్యవసాయాన్ని పండుగ చేసింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ వల్లే ఈ రోజు తెలంగాణలో విద్యుత్ వెలుగులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా 12 గంటలకు మించి ఉచిత విద్యుత్ సరఫరా కానప్పుడు..16 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్..ఉచిత విద్యుత్ పేరుతో..ఆ బడ్జెట్ కింద కేటాయించిన నిధుల్లో సగం డబ్బు..అంటే ఏడాదికి 8 వేల కోట్లు రూపాయలు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వాస్తవంగా కేసీఆర్ 24 గంటల విద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని, ఎక్కడా లేని రేటుకు తెలంగాణ విద్యుత్ కొనుగోలు చేస్తుందని, కేంద్రం మాట వినకుండా అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఉచిత విద్యుత్తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చిందని, రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుందని, వినియోగం ఆధారంగా తెలంగాణకే ఎక్కువ విద్యుత్ వొచ్చేలా సోనియా గాంధీ చర్యలు తీసుకున్నారని రేవంత్ వ్లెలడించారు. జనాభా ప్రాతిపదికన పంచితే తెలంగాణకు 38 శాతం మాత్రమే విద్యుత్ దక్కేదని, దాంతో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణలో చీకట్లు కమ్ముకునేవని, దీంతో జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయించారని రేవంత్ తెలిపారు. అందుకే తెలంగాణకు 53 శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్ కేటాయించారన్నారు. ఇందుకోసం అప్పటి కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి, కాంగ్రెస్ నేతలు కృషి చేశారని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. భదాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అప్పట్లో కేసీఆర్ గొప్పగా చెప్పారని, 2.60 పైసలకే విద్యుత్ ప్లాంట్లు ఇస్తామని…ప్లాంట్ల ఏర్పాటు విరమించుకోవాలని అప్పటి కేంద్రం విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ప్లస్ గ్రేడ్ ఉన్న డిస్కమ్లు..కేసీఆర్ పాలనలో సీ మైనస్కు పడిపోయాయని, కాంగ్రెస్ హయాంలో మొదటి పది స్థానాల్లో ఉన్న డిస్కమ్లు…కేసీఆర్ హయాంలో చివరి పదిస్థానాల్లోకి పడిపోయాయని రేవంత్ అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్కు ఎలాంటి శశభిషలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17న తమ మేనిఫెస్టోలో ప్రకటిస్తామని వెల్లడించారు. కెసిఆర్ ఉచిత విద్యుత్ ముసుగులో ఏడాదికి 8 వేల కోట్లు దోచుకుంటున్నారని, పవర్ ప్లాంట్ల విషయంలో 45 వేల కోట్లకు టెండర్లు ఇచ్చి అందులో అవినీతికి పాల్పడ్డారన్నారు. దోపిడీలు చేసి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ను రద్దు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. అన్ని సబ్ స్టేషన్ల లాక్ బుక్కులు సరెండర్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ‘కేటీఆర్, హరీష్ను సూటిగా అడుగుతున్నా..24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి ఇచ్చిన సవాల్ను స్వీకరించండి’’ అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. వారి అసలు నిజం బయటపడుతుందనే బీఆరెస్ నిరసనల డ్రామాలు చేస్తుందని విమర్శించారు. కరీంనగర్ చౌరస్తాలో గుమ్మికింద పందికొక్కు తనను ఉరి తీస్తా అని మాట్లాడుతుండని…తాను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్నారని, మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వొచ్చారు? అని రేవంత్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన వారా తన గురించి మాట్లాడేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 27 లక్షల 50 వేల మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించబోతుందని, ఇది నిజం కాదని చెప్పడానికి వాలో ఎవరు వొస్తారు?’’ అని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేశారు. జూలై 2న ఖమ్మం సభతో తాము ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే… బుధవారం నిరసనలతో బీఆరెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిందన్నారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్సే ప్రత్యర్థి, ప్రతిపక్షం అని ఆ పార్టీ చేపట్టిన నిరసనలు, ధర్నాలతో తేలిపోయిందని మరోసారి రేవంత్ స్పష్టం చేశారు. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 80 శాతం ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే రిపోర్టులో తేలిందని రేవంత్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు..గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్లో ఓడిపోతారని సర్వేల్లో తేలిందని రేవంత్ చెప్పుకొచ్చారు. అందుకే కేసీఆర్ పక్క నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారని రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్లో ఇప్పుడున్న సిట్టింగ్లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. మగాళ్లు అయితే సిట్టింగ్లకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని లేకుంటే మాడా అని ఒప్పుకోవాలలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 24 గంటల విద్యుత్పై గతంలో సీబీఐ విచారణ కోరిన బిజెపి ఎంపి లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారిందని ఆరోపణలు చేసిన మోదీ, అమిత్ షా..కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని రేవంత్ ప్రశ్నించారు.




