- అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్
- స్క్రీనింగ్ కమిటీ త్వరలో మరోసారి భేటీ కానుందని సిఎల్పి నేత భట్టి వెల్లడి
- కోమటిరెడ్డి అలక…బుజ్జగించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్కృష్ణ హోటల్లో ఆయన వి•డియాతో మాట్లాడుతూ…స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ను చాలా మంది కలిసి తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అలక చెందలేదన్నారు. కాంగ్రెస్లో ఆయన ముఖ్య నేత అని తెలిపారు. అయితే సమావేశం మధ్యలోనే ఆయన వెళ్లిపోవడం హాట్ టాపిక్గా మారింది. ఇదిలావుంటే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి పార్టీపై అలిగారు. ఇటీవలి కాలంలో కీలక సమావేశాలకు హాజరు కావడం లేదు. స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీకి సైతం ఆయన డుమ్మా కొట్టారు. పార్టీలో ఇటీవల కీలక పదవులు దక్కక పోవడంపై ఆయన తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే ఆయన స్వరం మార్చి ఆత్మగౌరవం ముఖ్యమని సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించడం ప్రారంభించారు.
రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి..ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్క్రీనింగ్ కమిటీలో పదవి ఇచ్చారని. తనకు మాత్రం ఏ పదవి దక్కలేదని ఆయన అసంతృప్తికి గురయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక గురించి తెలుసుకుని బుజ్జగింపులకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఏఐసీసీ ఆదేశాలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. సమస్యల్ని అంతర్గతంగానే.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ వొస్తున్నానని తనను కలవాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. కోమటిరెడ్డితో మాట్లాడారు.
పార్టీలో ప్రాధాన్యం తగ్గదని.. సీనియర్ లీడర్గా ఆయనకు ప్రాధాన్యం ఉంటుందని హావి• ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రేవంత్రెడ్డి పీసీసీ నాయకత్వాన్ని విభేదిస్తూ..కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. అయితే కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కలిసి పని చేయాలనే అధిష్టానం ఆదేశాలతో కలుపుగోలుగా పని చేయాలని భావించారు. ఈ తరుణంలో..పార్టీలో చేరికలు, సీట్ల కేటాయింపు అంశం మళ్లీ కోమటిరెడ్డిని అసహనానికి లోను చేశాయి. ఈలోపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండింటిలో జాబితా వెలువడడం..ఆ రెండింటిలో తనకు పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.



