కక్ష రాజకీయాలకు ఖమ్మం వేదికైంది… మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్
ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు శ్రీసిటిలోని ఆయన నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో అన్ని బీరువాలను, బ్యాగ్లను క్షుణ్ణంగా పరిశీలించి సోదాలు నిర్వహించారు. సీవిజిల్ యాప్లో వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించామని, ఎటువంటి నగదు, ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ఎలాంటివి లభ్యంకాలేదని ఆమె తెలిపారు. తనిఖీలు నిర్వహించేటప్పుడు ఇంట్లో తుమ్మల సతిమణీ భ్రమరాంభ ఉండగా ఆమె అధికారులకు సహకరించారు.
ఈ తనిఖీలో రూరల్ సీఐ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా తుమ్మల మాట్లాడుతూ ఖమ్మంలో కక్ష్య సాధింపు రాజకీయాలు చేస్తున్నారని, అధికారం అడ్డు పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ఆగడాలు ఎక్కువ రోజులు కొనసాగవని ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటి చైర్మన్ పొంగులేటి గత వారం రోజుల క్రితమే తమపై ఇలాంటి విజిలెన్స్ దాడులు జరుగుతాయని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.





