ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 09 : తిరుమల తిరుపతి ప్రవిత్ర క్షేత్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని హిందుస్ ఆఫ్ సౌత్ అఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, రచయిత కృష్ణ బాలు డిమాండ్ చేశారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా, సభ్యులుగా హిందూ నాస్తికులను, లిక్కర్ స్కాం లో నిందితులు అర్హత లేని వారు ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో అసంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. క్రైస్తవ మిషనరీ ప్రచారకులను తిరుమలకు అనుమతించొద్దని అన్నారు. ఈ అఘాయిత్యాలను అరికట్టడానికి, పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడమేనని అన్నారు. బోర్డు సభ్యులుగా నాస్తికులను నియమించడం ఘోరమైన తప్పిదాలు అన్నారు. ఎన్నడూ లేని విధంగా తిరుమలలో చిరుత దాడులు పెరిగిపోయాయాని అన్నారు. రైల్వే బోర్డు మాదిరిగా దేశంలోని ఆలయాల నిర్వహణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి జోన్లుగా విభజించి ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ జరిపించాలన్నారు.



