- మిగతా రాష్ట్రాలు పోటీని స్వీకరించాలి
- సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం ఒక్కటే.. పుడమిని కాపాడటం
- ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదు.. కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలి
- యువ ఎంపీ సంతోష్ కుమార్ ఛాలెంజ్ చొరవ అభినందనీయం
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడత ప్రారంభించిన సద్గురు జగ్గీ వాసుదేవ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని చెప్పారు సద్గురు జగ్గీ వాసుదేవ్. తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని ఆయన అన్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతుందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతుందని అన్నారు సద్గరు జగ్గీ వాసదేవ్. పుడమికి, మట్టికి ప్రత్నామ్నాయం లేదని..వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. సేవ్ సాయిల్(మట్టిని రక్షించు) ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్ మీదుగా బెంగుళూరు పయనం అయ్యారు.
మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్ పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణకు హరితహారం ప్రగతి నివేదికను సమావేశంలో వివరించారు. ప్రభుత్వం సాధించిన పచ్చదనం పెంపు విజయాలను సద్గురుకు వివరించారు.
ఎంపీ సంతోష్ చిన్న వయసులో పెద్ద బాధ్యత తీసుకున్నారు : సద్గురు
చిన్న వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సద్గరు ప్రశంసించారు. సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనని..పుడమిని కాపాడుతూ, ప్రకృతి, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికీ తెలియజెప్పటమే అన్నారు.



