- దోచుకున్న లక్ష కోట్ల డబ్బులు ప్రజల ఖాతాల్లో వేస్తాం
- తెలంగాణ సంపద దోపిడికి గురవుతుంది
- పోటీ దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం
- రూ .500 కే వంటగ్యాస్ సిలిండర్
- ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ
- కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిన ప్రదేశాన్ని పరిశీలించిన కాంగ్రెస్ అగ్రనేత
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 02 : ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య అని ఏఐసిసి నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకున్న లక్షల కోట్ల రూపాయలను వసూలు చేసి ప్రజల ఖాతాలోకి జమ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబం అత్యంత అవినీతికి దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. కాలేశ్వరం భారీ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏటీఎంలో మారిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
గురువారం ఉదయం కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిన ప్రదేశంలో పరిశీలించేందుకు విచ్చేసిన రాహుల్ గాంధీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యరావు థాక్రే, సిఎల్పి నేత్త భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క లతో పాటు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, చాలామంది రైతులు తమ భూములను కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటి రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్ బిజెపి, ఎంఐఎం పార్టీలు మూడు ఒకటేనని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు కలిసి ఒక్కటై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం. రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం ద్వారా రూ. 2500 మహిళ ఖాతాలోకి జమ చేస్తామని పునరుద్ఘాటించారు.

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన రాహుల్…
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమని చేపట్టిన కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ ప్రాజెక్ట్ పిల్లర్లు ఇటీవల కృంగిపోయి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఆ ప్రదేశాన్ని గురువారం రాహుల్ గాంధీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటిపల్లి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టును పరిశీలించేందుకు కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే అనుమతి ఇవ్వడంతో అక్కడికి తరలివచ్చిన నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రజలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్విక్త పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్ర ప్రభుత్వం.
పోలీసులు 144 సెక్షన్ విధించడంతో తీవ్రతోపులాట జరిగింది. ప్రజలందరూ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించేందుకు పరుగులు తీయగా పోలీసులు అడ్డుకుని ప్రజలను ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా నియంత్రించారు. రాహుల్ గాంధీ రాక సందర్భంగా పోలీసులు మేడిగడ్డ పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున పోలీసు బలగాలని మోహరించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణరావు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




