ముంబై, జూన్ 6 : దేశంలోని కరెన్సీ నోట్లపై టాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే అంశంపై స్పష్టత ఇచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంకు. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కుండబద్దలు కొట్టింది. కరెన్సీ నోట్ల మార్పు వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ టాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వొచ్చిన వార్తలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఖండించింది.
ప్రస్తుతం ఉన్న కరెన్సీ, బ్యాంకు నోట్లపై చిత్రాలు, కొత్త వాటర్ మార్క్లతో మార్పులు చేసే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కరెన్సీ నోట్ల మార్పు వార్తలకు ముగింపు పలికింది. చిత్రాలను ముద్రించే అంశాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు పరిశీలిస్తున్నట్లు పలు జాతీయ వి•డియాలో వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం మాత్రమే ఉండగా.. తొలిసారి ఇతరుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్బీఐ ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. 2017లోనే ఈ ప్రతిపాదన వొచ్చినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అయితే ఈ విషయమై త్వరలోనే ఒక నిర్ణయానికి రావాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు వార్తలు వొచ్చాయి. తాజాగా ఆ వార్తలను ఆర్బిఐ ఖండించింది.




