హైదరాబాద్, ప్రజాతంత్ర: ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం 2004 నుంచి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఓబీసీ సంఘాలు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిశాయని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ డిమాండ్ను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఓబీసీ మంత్రిత్వ శాఖ కోసం ప్రధాని మోదీని కూడా కోరామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, 2023 బ్జడెట్లో నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతకుముందు 2004 సంవత్సరంలోనూ ఇవే విజ్ఞప్తులతో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఓబీసీ నాయకుల బృందం నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 2004లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కేసీఆర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కలిసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ కు ‘ఓబీసీ అప్నా హక్ మాంగో’… ‘మినిస్ట్రీ ఆఫ్ ఓబీసీ’ అనే హ్యాష్ ట్యాగ్లను జోడించారు.



