పలువురు అధికారులపై బదిలీ వేటు
భువనేశ్వర్, జూన్ 23 : భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ ప్రమాదం ఒకటి. ఈ నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సపంలో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 292 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ నిర్వహిస్తున్న సంగతి విధితమే. కాగా, ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత అధికారులపై రైల్వే బోర్డు చర్యలకు ఉపక్రమించింది. సౌత్ ఈస్టర్ రైల్వేస్ కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులపై వేటు వేసింది.
సిగ్నలింగ్, ఆపరేషన్స్, సేప్టీ విభాగాలను చూసే ఈ అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది.వారిలో ఖరగ్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ శుజాత్ హష్మీ, ఎస్ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ పీఎం సిక్దర్, ప్రిన్సిపల్ చీఫ్ సేప్టీ ఆఫీసర్ చందన్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీబీ కేసర్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎండీ ఓవైసీపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఇది సాధారణ బదిలీల్లో భాగమేనని అధికారులు వెల్లడించారు.


