పత్రికలు, టీవీలకు ఫ్రీడమ్ ఇస్తూ ముందుకు
•జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాలి
•పొత్తూరి స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారం వెంకట్ నారాయణకి అందజేసిన సీఎం రేవంత్
రవీంద్రభారతి, ప్రజాతంత్ర, మార్చి 05 : రాజకీయ నాయకులు మోర్ పవర్ అంటే జర్నలిస్టులు మోర్ ఫ్రీడమ్ అంటారని, సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం జర్నలిస్టు, సీనియర్ సంపాదకులు దివంగత పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారం ప్రధానోత్సవ సభ రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఇండియాటుడే మాజీ ఎడిటర్ వెంకట్ నారాయణకి పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ అవార్డు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ వెంకట నారాయణ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనాత్మక వార్తలు రాసారని కొనియాడారు. ఆయనకు తన చేతుల మీదుగా పొత్తూరి వెంకటేశ్వర రావు ఉత్తమ పాత్రికేయ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజల సమస్యలు లెవనెత్తి, వాటిని పరిష్కరించే అవకాశం జర్నలిస్టులకు ఉంటుందన్నారు. పరిశోధనాత్మక జర్నలిజం వల్ల పెద్ద పెద్ద నాయకులనే జర్నలిస్టులు కిందికి దించారని అన్నారు. పత్రికలు, టీవీలకు ఫ్రీడమ్ ఇస్తూ వారి సమస్యలను పరిష్కరించేలా మా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ప్రజా సమస్యలు వెలికి తెచ్చి పరిష్కరింపజేయడం జర్నలిస్టులకే సాధ్యం అన్నారు. పరిపాలనలో అనుభవజ్ఞులు సూచనలు తీసుకుని మా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర తగ్గుతోందన్నారు. గతంలో పీవీ, ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు జాతీయస్థాయిలో తెలుగు జాతి సత్తా చాటారని అన్నారు. ఇది మనకు ప్రమాదకరమైన ప్రమాదకర పరిణామం అన్నారు. జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీపై ప్రభావితం చేసే వారిని ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, పాశం యాదగిరి, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.





