‘‘గత కొంత కాలంగా ఆర్ధిక, రాజకీయ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న శ్రీలంకలో వేకువ ఝామూలాంటి తొలి సూర్య కిరణాల్లా ఆశా కిరణాలు ఉదయిస్తున్నాయి. దేశ నాయకత్వ పగ్గాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి చేతుల్లోకి వెళ్లాయి. ప్రజాగ్రహానికి భయపడి ప్రధాని కుర్చీ నుంచి మహిందా రాజపక్సే తప్పుకున్నారు. ఆ దేశ కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేయటంతో శ్రీలంకేయుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.’’
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన లంకకు ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈ 73 ఏళ్ళ రణిల్ విక్రమ సింఘే ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన బౌద్ధ సింహళ కుటుంబానికి చెందిన వ్యక్తి. సిలోన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాది పట్టా పొందారు. చదువు పూర్తి అయిన వెంటనే వారసత్వంగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1977లో మొదటి సారి యునైటెడ్ నేషనల్ పార్టీ నుంచి బియాగమా స్థానం నుంచి బరిలో నిలబడి పార్లమెంటరీ ఎన్నికలను ఎదుర్కొని గెలిచారు. విదేశీ వ్యవహారాల డిప్యూటీల మంత్రిగా పదవి పొందారు. శ్రీలంక దేశంలో దశాబ్దాల నుంచి కుటుంబాల పాలనే జరుగుతూ వస్తోంది. రణిల్ మొదటిసారి గెలిచినప్పుడు ఆ దేశ అధ్యక్షుడుగా ఉన్నది ఆయన అంకుల్ జే. ఆర్. జయవర్ధనే. కాబట్టి సహజంగానే మొదటి అడుగులోనే రాజకీయంగా కీలక స్థానాలు పొందే అవకాశం రణిల్కు దక్కింది. నుంచి యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడిగా ఉన్నారు.
ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రధానిగా పని చేసిన అనుభవం ఉంది. రెండు దఫాలుగా 1994 నుంచి 2001 వరకు, 2004 నుంచి 2015 వరకు శ్రీలంక ప్రతిపక్ష నేతగా కూడా పని చేశారు. 2018లోనూ లంకలో ఇటువంటి రాజకీయ సంక్షోభం తలెత్తింది. అప్పుడు ప్రధానిగా ఉన్న రణిల్ను మిథిరపాల సిరిసేన పదవీ భ్రష్టుణ్యి చేశారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలకు లంక వేదికగా నిలిచింది. 2020లో జరిగిన ఫలితాల్లో రణిల్ తన పార్టీని అధికారంలోకి తీసుకుని రావటంలో విఫలమయ్యారు. యునైటెడ్ నేషనల్ పార్టీ నేరుగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. అయితే ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం పార్లమెంట్ లో ఒక సీటు లభించింది. ఆ స్థానంలో రణిల్
పార్లమెంటులో అడుగు పెట్టారు. 225 సీట్లున్న శ్రీలంక పార్లమెంట్కు ఇప్పుడు ఒకే ఒక స్థానబలం ఉన్న రణీల్ నాయకత్వం వహిస్తున్నారన్నమాట. శాసనపరమైన కోణంలో చూస్తే ఇది కూడా చాలా అరుదైన, అనూహ్యమైన పరిస్థితే.
రణీల్ ముందు ఉన్న సవాళ్లు-
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రణీల్ విక్రమ సింఘేకు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. మొదటి సవాలు ఆందోళనకారులు, ప్రజల నుంచే ఎదురవుతోంది. రాజపక్సే గద్దె దిగినంత మాత్రాన మా సమస్యలు పరిష్కారం కాలేదు…రణీల్ను ప్రధానిగా అంగీకరించేది లేదని ఆందోళనకారులు గళం ఎత్తుతున్నారు. అధ్యక్షుడు గో గో గోటమాయా అన్న
నినాదాలు కొలంబో వీధుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. తాత్కాలికంగా కొంత ఉపసమనం కనిగించనిదే ప్రజాగ్రహం జ్వాలలు తగ్గేటట్లు లేవు. కనీసం ప్రజలకు తినటానికి తిండి గింజలైనా అందుబాటులో ఉండేటట్లు తక్షణం చూడాల్సిన బాధ్యత ప్రధాని పై ఉంది. నిత్యవసరాల అందుబాటు మాత్రమే కాదు ధరలను కూడా కిందికి దింపాల్సి ఉంది. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందన్నదే పెద్ద సమస్య. దేశంలో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. విదేశాల నుంచి కొనుగోలు చేయాలంటే గల్లా పెట్టే నిండుకుంది. అప్పు చేస్తే సరిపోతుందా అంటే ఇప్పటికే శ్రీలంక అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త అప్పు పుడుతుందా? ఒక వేళ ఏ దేశమైనా ఉదారంగా ముందుకు వస్తే తీర్చగలిగే మార్గం దొరుకుతుందా…ఇలా ఒకదానికి ఒకటి చెయిన్ లింకుల్లా కలిసిపోయి ఉన్న సమస్యలు. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనటానికి ఒక ఉదాహరణ కాగితాలు కొరతతో పరీక్షలను వాయిదా వేశారు. విద్యుత్, నీరు వంటి కనీస మౌలిక అవసరాలు లేని పరిస్థితి. అంటే ఒక వైపు ప్రాధమికంగా బియ్యం, పప్పుధాన్యాలు, పాలు, కూరగాయలు, ఔషధాలు వంటి నిత్యవసరాల అందుబాటు, ధరల తగ్గుదల పై ప్రధానంగా దృష్టి సారిస్తూనే తాగు నీరు, పరిశుభ్రత, విద్యుత్, ప్రజా రవాణా వంటి కనీస మౌలిక అవసరాలను అందించటానికి ప్రణాళికాబద్దంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే శ్రీలంక 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించలేమని ప్రకటించింది. మరోవైపు ప్రజల్లో విశ్వాసం ఏర్పడే విధంగా చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక మరో కీలకమైన అంశం మన వాళ్లకే పంక్తి భోజనం లాంటి సంప్రదాయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. శ్రీలకం ప్రజల ఆగ్రహానికి మిగిలిన అనేక అంశాలతో పాటు రాజపక్సా కుటుంబ పాలన కూడా ఒక కారణం. రాజపక్సాల కుటుంబమే దాదాపుగా కేంద్ర మంత్రివర్గాన్ని పంచుకోవటం కూడా అసమర్ధ పాలనకు బీజం వేసింది. దీన్ని ప్రస్తుతం సంక్షోభ వాతావరణంలో బ్రేక్ వేయాల్సి ఉంది. రాజపక్సాలంటేనే ప్రజలు మండిపడుతున్న సమయంలో అధికారంలోకి కొత్త ముఖాలను, కొత్త నాయకత్వాన్ని తీసుకుని రావలసి ఉంది. అవినీతికి కళ్లెం వేసి కొత్త ఆలోచనలతో పాలన పాలనను ట్రాక్ మీద పెట్టకపోతే సంక్షోభం సముద్రంలో ఈ చిన్న ద్వీపం మునిగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఆ బాధ్యత రణిల్ తీసుకుంటారో లేదో కొంత కాలం వేచి చూస్తే కాని తెలియదు.