- ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు…అత్యాచారం…హత్య
- ఆలస్యంగా వెలుగు చూసిన వీడియో
- ఘటనపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు
- తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
- నిందితులకు బహిరంగ ఉరేస్తామన్న రాష్ట్ర సిఎం
ఇంఫాల్, జూలై 20 : మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి..ఆపై సామాఊహిక అత్యాచారం చేసి చంపిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం అయ్యింది. దీంతో దేశం యావత్తూ తలదించుకుంది. ఇలాంటి అమానవీయ ఘటనపై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సుప్రీంకోర్టు కూడా కేసును సుమోటా తీసుకుంది. ఈ నేరానికి పాల్పడ్డ వారికి బహిరంగ ఉరి వేస్తామని సిఎం ప్రకటించారు. ఘటనపై చర్చకు పార్లమెంటులో విపక్షం పట్టుబట్టింది. మణిపూర్లో రెండు తెగల మధ్య చాన్నాళ్ల నుంచి ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే రెండు నెలల క్రితం ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అయ్యింది. ఆ మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతన్ని 32 ఏళ్ల హీరాదాస్గా గుర్తించారు. అతనిది తౌబాల్ జిల్లాగా గుర్తించారు. మణిపూర్లోని కంగ్పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే బుధవారం ఆ వీడియో మరోసారి వైరల్ అయ్యింది. ఆ వీడియోపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. నిందితులకు మరణదండన ఉంటుందన్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. కిడ్నాప్, గ్యాంగ్రేప్, మర్డర్ కింద కేసు బుక్ చేశారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు 12 బృందాలుగా అన్వేషించారు. మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేపట్టామని, గురువారం ఉదయం ఒకర్ని అరెస్టు చేసినట్లు సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్నారు. ఇలాంటి ఘటనలకు సమాజంలో చోటులేదన్నారు. కుకీ తెగను చెందిన మహిళల్ని.. మైటేయి తెగకు చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగించారు. మణిపూర్లో హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో గురువారం ఉదయం ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో ఆధారంగా సుప్రీంకోర్టు సమోటోగా ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుంది. ఇక మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని వారిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. మణిపూర్ హింసాకాండపై, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదిపారు. ఇది నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని మోదీ పేర్కొన్నారు. మణిపూర్ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఈ ఘటనను రాజకీయం చేయవద్దని కోరారు. దేశం యావత్తూ ఈ ఘటనపై ఆగ్రహంతో ఉందని, నేరస్తులను తీవ్రంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్లో కుకి-జోమి వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా తీసుకువెళుతున్న ఈ వీడియో సోషల్ వి•డియాలో బుధవారం వెలుగుచూసింది. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటనలో మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మే 4న జరిగిందని, బాధితురాలిలో ఒకరు 19 ఏండ్ల యువతి అని పోలీస్ వర్గాలు తెలిపాయి.
మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనపై మాజీ సీజేఐ, రాజ్యసభ ఎంపీ రంజన్ గగోయ్ స్పందించారు. ఆ ఘటన చాలా బాధాకరమని, అది దురదృష్టకర సంఘటన అని ఆయన అన్నారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆయన పార్లమెంట్కు వచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ఘటనపై కామెంట్ చేయాల్సింది ఏవి•లేదన్నారు. జాతీయ మహిళా కవి•షన్ కూడా మణిపూర్ ఘటనను ఖండించింది. నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు చెప్పింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మణిపూర్ డీజీపీని కోరినట్లు జాతీయ మహిళా కమిషన్ పేర్కొన్నది. ఈ ఘటనకు చెందిన ఓ ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారని ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు మరికొందర్ని అదుపులోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. ట్విట్టర్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చామని, ఇలాంటి వీడియోలను ఆపేయాలని సూచించామన్నారు. మణిపూర్ ఘటనపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. వీడియో వైరల్ కావడం వల్లే ప్రధాని మోదీ స్పందించారని ఓవైసీ విమర్శించారు. మణిపూర్లో ఊచకోత జరుగుతోందన్నారు.
సీఎం బీరేన్సింగ్ను తొలగిస్తేనే అక్కడ న్యాయం జరుగుతుందని, తెగల వైరంపై సీబీఐ విచారణకు ప్రధాని ఆదేశించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. మణిపూర్లో జరుగుతున్న పరిణామాల గురించి సభలో చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ ప్రధాని మోదీని కోరారు. ఈ విషయాన్ని మరో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవాళ లోక్సభలో ఈ ఘటన జరిగిందన్నారు. తొలి రోజు సభ సందర్భంగా ప్రధాని మోదీ విపక్ష నేతల్ని కలిశారు. గ్రీటింగ్ చేస్తున్న సమయంలో సోనియా గాంధీతోనూ మోదీ మాట్లాడారు. విపక్ష నేతల బెంచ్ వద్దకు చేరుకున్న సమయంలో ఆయన సోనియాతో కాసేపు మాట్లాడారు. ఆ సమయంలో మణిపూర్ గురించి సభలో చర్చించాలని ప్రధాని మోదీని సోనియా కోరినట్లు అధిర్ రంజన్ తెలిపారు. మరోవైపు సోనియా ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది.




