Take a fresh look at your lifestyle.

‘‌పల్లె ప్రగతి’తో దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు

  • కేంద్రంతో మనకు రాజకీయ వైరుధ్యాలున్నా అవార్డులు ఇవ్వక తప్పడం లేదు
  • ఇప్పుడన్ని గ్రామాలు అంకాపూర్‌, ‌గంగదేవి పల్లిలే…
  • సిరిసిల్లలో అవార్డులు పొందిన గ్రామాల సర్పంచ్‌లకు మంత్రి కెటిఆర్‌ అభినందన
  • పల్లె ప్రగతిలో పల్లెలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాయి : కలెక్టర్‌

సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 27 : 75 ఎండ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో సీఎం కేసీఆర్‌ ‌ప్రారంభించిన పల్లెప్రగతి కార్యక్రమంతో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా తెలంగాణ పల్లెలు వెలుగొందుతున్నాయని రాష్ట్ర మంత్రి కేటి రామారావు అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ ‌సతత్‌ ‌వికాస్‌ ‌పురస్కార్‌లో భాగంగా జాతీయ పంచాయితీ అవార్డ్ -2023 ‌కార్యక్రమంలో భాగంగా 9 కేటగిరీల్లో మొదటి మూడు స్థానాల్లో ఉత్తమంగా నిలిచిన జిల్లాలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచులకు సంబంధిత ఎంపీపీ, జెడ్పీటీసీ సమక్షంలో మంత్రి ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు.

 

కొత్త పంచాయితీ రాజ్‌ ‌చట్టం తెచ్చి గ్రామ పంచాయితీ విధులు, నిధులు, బాధ్యతలు పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు పెద్ద పీట వేశామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనులతో గ్రామాల రూపురేఖలే మారాయన్నారు. సర్పంచులు, అధికారులు సమష్టిగా కృషిచేయడం వల్లనే మంచి ఫలితాలు వొస్తున్నాయని అన్నారు. కేంద్రం , తెలంగాణ మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్న దేశంలో ఉత్తమ పల్లెలు ఎక్కడున్నాయనీ అంటే తెలంగాణ పల్లెలే అని చెప్పక తప్పడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 పంచాయతీలు రాష్ట్రానికి చెందినవి కావడం గర్వకారణమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్‌కు రెండు సార్లు ఉత్తమ జడ్పిగా అవార్డుకు ఎంపికైందన్నారు. 25 గ్రామపంచాయతీలు, 13 మండలాలు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ సర్వేక్షన్‌లో వరుసగా మూడుసార్లు ఫోర్‌ ‌స్టార్‌ ‌రేటింగ్‌తో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌గా నిలిచిందన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. జిల్లా కలెక్టర్‌, ‌డీపీవో జెడ్‌పి సీఈఓతో పాటు అందరూ క్షేత్ర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.


ఇప్పుడన్ని గ్రామాలు అంకాపూర్‌, ‌గంగదేవి పల్లిలే…
ఒకప్పుడు తెలంగాణలో ఉత్తమ గ్రామపంచాయతీలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తే అంకాపూర్‌, ‌గంగదేవిపల్లి గ్రామాలే అనే సమాధానం వొచ్చేదని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పుడు రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అన్ని అంకాపూర్‌, ‌గంగాదేవి పల్లెలను తలపిస్తున్నాయని మంత్రి తెలిపారు. 12 పైగా రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తెలంగాణ పల్లెలలో జరుగుతున్న అభివృద్ధి, సుపరిపాలనను అధ్యయనం చేసేందుకు వొస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరులోపు 1300 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేస్తామని, గ్రామ పంచాయితీలకు పల్లె ప్రగతి, సిడిపి గ్రాంట్‌ల క్రింద 1 కోటి రూపాయల లోపు ఉన్న బకాయిలను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంపై ఆర్థిక శాఖ మంత్రితో కూడా తాను మాట్లాడాడని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా పనిచేస్తే ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకంలో రావాల్సిన 1200 కోట్ల రూపాయల బకాయిలను రాకుండా చేస్తుందని ఆరోపించారు. ప్రతి సంవత్సరం కేటాయింపులను తగ్గిస్తుందని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లాను గ్రామీణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ ‌జయంతి మాట్లాడుతూ…ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు అన్ని రంగాలలో పురోగమిస్తున్నాయని అన్నారు. 9 కేటగిరీల్లో మొదటి మూడు స్థానాల్లో ఉత్తమంగా నిలిచిన జిల్లాలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌ ‌కుమార్‌, ‌జిల్లా ప్రజా పరిషత్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌, ‌రసమయి బాలకిషన్‌, ‌రమణ, సారయ్య, ఎమ్మెల్యే లు చెన్నమనేని రమేష్‌ ‌బాబు, సుంకే రవి శంకర్‌, ‌జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ ‌జయంతి, అదనపు కలెక్టర్‌ ‌బి సత్య ప్రసాద్‌, ‌టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌ ‌రావు, సెస్‌ ‌చైర్మన్‌ ‌చిక్కాల రామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ టి శ్రీనివాస్‌ ‌రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply