ప్రగతి మంత్రం జపించో
హామీల అస్త్రం సంధించో
వాళ్లేప్పటికీ గెలుస్తున్నారు
జనాలు  ఓడిపోతున్నారు

గెలుపు సూత్రం ఒంటబట్టో
ప్రజల బలహీనత పసిగట్టో
వాళ్ళు వోట్లు కాజేస్తున్నారు

భారీ విగ్రహాలు ప్రతిష్టించో
భూరి నజరానా ప్రకటించో
వాళ్ళు గద్దె ఎక్కుతున్నారు

జాతీయవాదం పల్లవించో
కాసాయ సారం ప్రబోధించో
వాళ్ళు దేశాన్ని ఏలేస్తున్నారు

నిరుద్యోగం పెరిగినా
ధరలు నింగినంటినా
సాగు రంగం సన్నగిలికినా
రోజువారీ జీవితం క్లిష్టమైనా
వాళ్ళు మాత్రం సుసంపన్నమే

ఆత్మహత్యలు పెచ్చరిల్లినా
గంగానదిలో శవాలు తేలినా
కొరోనా మరణాలు వాటిల్లినా
చితి మంటలెంత చెలరేగినా
వాళ్ల  ప్రాణాలు సదా క్షేమమే

ఇదేమి విడ్డూరమో !
గొర్రె కసాయిని నమ్మినట్లు
జనం అవినీతి నేతల నమ్మి
మళ్ళీ పట్టం కట్టబెడుతుంది
దేశాన్ని తాకట్టు  పెడుతుంది

అయినా ఎదో ఒకరోజు
ప్రజా పోరు పోటెత్తుట ఖాయం
నియంతలకు గుణపాఠం తధ్యం

(ఇటీవలి ఎన్నికల ఫలితాల
నేపథ్యంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page