- ప్రజల ఆరోగ్య వివరాలపై కేంద్రం దృష్టి
- హైదరాబాద్లో ఆరోగ్య మేలా ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 22 : కొరోనా మహమ్మారి ప్రజల్లో భయం పుట్టించిందని..అలాగే వారికి ఆరోగ్యంపై శ్రద్ధను కలిగించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజారోగ్యానికి ఎల్లప్పుడు పెద్దపీట వేసే కేంద్ర ప్రభుత్వం..వారి ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా ఆరోగ్య మేలాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వారి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తుందని అన్నారు. దీంతో ప్రజలు తమ ఆరోగ్య వివరాలతో సకాలంలో వైద్యం పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలంతా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుతో నాణ్యమైన సర్కార్ వైద్యం అందుంతుందని అన్నారు.
హైదరాబాద్ నారాయణగూడ కేశవ స్మారక పాఠశాలలో ఆరోగ్య మేలాను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వొచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరోగ్య మేలాకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఏర్పాటు చేసిన స్టాళ్లను కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రతి ఒక్కరు ఈ మేలాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొరోనా మహమ్మారి తర్వాత దేశంలో ప్రజల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ప్రొఫైల్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ కార్డు పేద ప్రజలందరికీ అందేలా వైద్యాధికారులు చొరవ చూపాలని సూచించారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆరోగ్య మేలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న కేంద్రమంత్రి కొరోనా టీకా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ‘భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేలాలను నిర్వహిస్తుంది. ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్లలో సదుపాయాలు వినియోగించుకోకుండా ప్రైవేట్ హాస్పిటళ్ల బాట పడుతున్నారు. వారికి నాణ్యమైన సర్కార్ వైద్యం అందించేలా.. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా ఈ మేలాలను కేంద్ర సర్కార్ ఏర్పాటు చేసింది. పేద, ధనిక అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిందన్నారు.