అ‌ప్రమత్తంగా ఉండాలి..తక్షణ చర్యలు చేపట్టండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు  సిఎస్‌ ‌శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. భధ్రాచలంలో ముంపుకు గురయ్యే అవకాశాలున్న తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలన్నారు. గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సిఎం తెలిపారు.

ప్రస్తుతం హైద్రాబాద్‌ ‌కలెక్టర్‌గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్‌ను తక్షణమే బయలుదేరి భధ్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలని సిఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్‌లో, ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్‌ ‌రూమ్‌ ‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌దళాలను అందుబాటులో వుంచాలని సిఎం ఆదేశించారు. సిఎం ఆదేశాలమేరకు కంట్రోల్‌ ‌రూమ్‌ ‌సహా హెలీకాప్టర్లు సంబంధిత సహాయక చర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చేసిన అధికార యంత్రాంగం, భద్రాచలంలో సహాయక చర్యలకు సిద్ధంగా వుంది.

రెవిన్యూ, పంచాయితీ రాజ్‌, ‌వైద్యారోగ్యశాఖ, డిసాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌, ‌సహా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని, ఇందుకు సంబంధించి సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా వుందని సిఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *