హుస్నాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని సిఎం పూరించనున్నారు. లక్షమందితో బహిరంగ సభను హుస్నాబాద్లో నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని స్థానిక గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ సభ ద్వారా హుస్నాబాద్లో తిరుగులేని శక్తి బీఅర్ఎస్ పార్టీకే ఉండనే సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తుంది. హుస్నాబాద్లో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే సిఎం కేసీఆర్ ప్రకటించారు. సిఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితునిగా ఉన్న రాజ్యసభసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు తనయుడు వొడితల సతీష్ కుమార్ మూడోసారి గెలిచి ‘‘హ్యాట్రిక్ విజయం’’ నమోదు దిశగా ముందుకు వెళ్తున్నారు.
ఇప్పటికే హుస్నాబాద్ను అభివృద్ధి చేసింది తామేనని, గతంలో ఇక్కడ ఉన్న తీవ్ర కరువు పరిస్థితులను మార్చేశామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏ పార్టీకి లేని బలం, బలగం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని, లక్ష యాభైవేల మంది వివిధ పథకాల లబ్ధిదారులు తమవైపు ఉన్నారని, అలాగే మచ్చలేని వ్యక్తిత్వం ఉన్న నేత ఎమ్మెల్యేగా ఉన్నారని తమ విజయం ఖాయమని గులాబీ సైనికులు స్పష్టం చేస్తున్నారు. సిఎం కేసీఆర్ సభ తర్వాత గ్రామగ్రామాన ఎన్నికల ప్రచారంతో పాటు చివరి పదిహేను రోజులు అన్ని గ్రామాల్లో ఉధృతంగా మహిళలు, యువతతో పెద్ద ఎత్తున డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించి తమ సత్తా చాటాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాకముందే…ఎన్నికల ప్రచారం ప్రారంభించి ప్రత్యర్థులకన్నా అందనంత ఎత్తున ఉన్నామనే సంకేతాలు గులాబీ పార్టీ ఇస్తుంది.





