- కొత్తగా 12 వేల వోట్లను ఆమోదించాం
- హైకోర్టుకు వివరించిన ఎన్నికల సంఘం
- విచారణ 21కు వాయిదా
హైదరాబాద్, అక్టోబర్ 14(ఆర్ఎన్ఎ) : మునుగోడు ఎన్నికల జాబితా నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు సమర్పించింది. 25 వేల వోట్లర్లు నమోదు అయ్యారని, అందులో 12 వేలు మాత్రమే నిర్ధారించామని, మరో 7 వేల వోట్ల నమోదును తిరస్కరించామని ఎన్నికల సంఘం పేర్కొంది. పెండింగ్లో ఉన్న వోటర్లు పక్రియను నిలిపేయాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పెండింగ్లో ఉన్న వోటరు జాబితా నిలిపేయాలని ఆదేశిస్తూ..తదుపరి విచారణ ఈనెల 21కు వాయిదా వేసింది. మునుగోడు కొత్త వోటర్ల నమోదుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతించారు.
ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి రచనా రెడ్డి మాట్లాడుతూ..అధికార పార్టీ తీరుపై విమర్శలు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్రను అడ్డుకున్నామన్నారు. ఉప ఎన్నికలో 25వేల వోట్లను ఒకేసారి డంపు చేయాలని టీఆఅర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని వోటర్లుగా నమోదు చేయించారని, అధికార యంత్రాంగంపై ఒత్తిడి చేస్తుందన్నారు. బీజేపీ అడ్డుకోకుంటే..25 వేల బోగస్ వోట్లు నమోదు అయ్యేవని రచనా రెడ్డి పేర్కొన్నారు.




