స్వయం పాలనలో సింగరేణి ఘనకీర్తి…దేశానికే దిక్సూచి

హైదరాబాద్‌, ‌సెప్టెంబరు 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దిశా నిర్దేశంలో సింగరేణి ప్రభుత్వ సంస్థ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నది. దేశంలోని మరే ఇతర ప్రభుత్వ సంస్థలు సాధించని గణనీయ వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్వయం పాలనలో గత ఎనిమిదేళ్లలో రికార్డు స్థాయిలో లాభాలు పొందింది. కార్మిక వర్గం, అధికార యంత్రాంగం సమిష్టి కృషితో సంస్థ అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. విపత్కర పరిస్థితులను అధిగమించి 2021-22 లో రికార్డు స్థాయిలో 26,607 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది. మొత్తం టర్నోవర్‌పై పన్నులు విధించడానికి ముందు 1,722 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా సాధించిన టర్నోవర్‌పై నికర లాభాలు రూ.1,227 కోట్లు (పన్నులు చెల్లించిన తర్వాత) పొందింది.
image.png

2021-22 లో సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 655 లక్షల టన్నుల రవాణా చేసింది. సింగరేణి థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రం ద్వారా 88.08 మిలియన్‌ ‌యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్‌ ‌టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించుటకు అధికార యంత్రాంగం, కార్మిక వర్గం అహర్నిషలు కృషి చేస్తున్నది.

స్వరాష్ట్రంలో అద్భుత ప్రగతి
2013-14 ఆర్థిక సంవత్సరంలో 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి సంస్థ 2021-22 నాటికి 29శాతం వృద్ధితో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. 2013-14లో 479 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన కంపెనీ 2021-22 నాటికి 37 శాతం వృద్ధితో 655 లక్షల టన్నుల రవాణా జరిపింది. 2013-14లో 11,928 కోట్ల రూపాయలుగా ఉన్న అమ్మకాలు 123 శాతం వృద్ధితో గత ఏడాదికి 26,607 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాభాలు కూడా గణనీయంగా, గరిష్ఠంగా 193 శాతానికి పెరిగాయి. 2013-14లో 419 కోట్ల రూపాయల నికర లాభం సాధించగా, 2021-22 నాటికి 1,227 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించగలిగింది.

సంక్షేమం పెరిగింది-ఉత్పత్తి పెరిగింది
సింగరేణి కార్మికులు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాల ప్రక్రియను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ఆదేశంతో సింగరేణి సంస్థ అమలు పరచడం కార్మిక వర్గంలో నూతన ఉత్సాహాన్ని కలిగించింది. సంస్థ లక్ష్యాల సాధనలో కార్మిక వర్గం అహర్నిషలు కృషి చేస్తున్నది. ముఖ్యమంత్రి ఆదేశాలపై సింగరేణి సంస్థ కార్మికులకు, వారి తల్లిదండ్రులకు సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యం అందించడం, స్వంత ఇళ్ళు నిర్మించుకొన్న కార్మికులకు 10 లక్షల రూపాయల ఋణంపై వడ్డీ చెల్లింపు విధానం, కార్మికుల క్వార్టర్లకు ఏసి సౌకర్యం, ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబానికి ఇచ్చే మ్యాచింగ్‌ ‌గ్రాంటు మొత్తాన్ని 10 రెట్లకు పెంచడం, కార్మికులు చెల్లించే కరెంటు చార్జీలు రద్దు చేయడం, ఉన్నత చదువులో ఉన్న కార్మికుల పిల్లలకు కంపెనీ ఫీజు చెల్లించడం, ప్రతి సంవత్సరం కార్మికులకు లాభాల బోనస్‌ ‌చెల్లింపు, పండుగ అడ్వాన్సుల పెంపుదల, ఆహర క్యాంటీన్‌లలో ఆధునీకరణ మొదలైన అనేక సంక్షేమ చర్యలు కార్మికులకు ఎంతో సంతోషం కలిగిస్తున్నాయి. సింగరేణి సంస్థ గత 8 ఏళ్ల కాలంలో అనూహ్యమైన ప్రగతి సాధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు ప్రధాన స్ఫూర్తిగా నిలిచాయి. ఇదే ఒరవడితో కృషిచేస్తూ 2022-23 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని తద్వారా మరిన్ని లాభాలు అర్జించాలని సింగరేణి అధికార యంత్రాంగం భావిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *