హిమాయత్నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త రాజకీయ సంస్కృతిని నెలకొల్పేందుకు సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ కమిటీ కృషి చేస్తుందని ఎస్.పి.ఐ తెలంగాణ రాష్ట్ర నూతన వ్యవస్థాపక అధ్యక్షులు బోద్రామోని పురుషోత్తం వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి ప్రజలకు అందించడమే ఎస్.పి.ఐ లక్ష్యం అని తెలిపారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ కమిటీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు ఆర్.ఝాన్సీ అతిథులను వేదికపైకి ఆహ్వానించగా ఈ.రాజేష్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. దాదాపు 33 జిల్లాల నుండి హాజరైన ప్రతినిధులు బోద్రామోని పురుషోత్తంను నూతన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా బోద్రామోని పురుషోత్తం సభనుద్దేశించి మాట్లాడుతూ జయప్రకాశ్ నారాయణ్ వంటి గొప్ప సోషలిస్ట్ నాయకులు 1934 లో సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా స్థాపించారని, ఇప్పటికి భారత ఎన్నికల కమిషన్ గుర్తింపుతో జాతీయ రాజకీయ పార్టీగా కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఎస్.పి.ఐ రాష్ట్ర కమిటీ ఇప్పటివరకు ఏర్పడలేదని, సోషలిస్ట్ భావాలూ కలిగిన సమూహాలు అన్ని కలసి నేడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎస్.పి.ఐ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మొత్తం 33 జిల్లాలలో కమిటీలు నియమించామని, మూల స్థాయి నుండి పార్టీని బలోపితం చేస్తున్నామని, త్వరలో రైతు, మహిళా, విద్యార్ధి, యువజన విభాగాలను ఏర్పాటు చేస్తామని తెలియజేసారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్.పి.ఐ కు బలమైన అభ్యర్థులు ఉన్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య, సామ్యవాద భావాలూ కలిగిన రాజకీయ పార్టీలతో కలసి రాష్ట్రంలో10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్.పి.ఐ అభ్యర్థులు పోటీ చేస్తారని బోద్రామోని పురుషోత్తం ప్రకటించారు. ఈ సభలో ఎస్.పి.ఐ నేతలు బి.సుజాత, ఎస్.కె.ఆడమ్. కె.నరసింహ, మారం రామస్వామి, వెంకట్ స్వామి, సురేష్ పటేల్, సంధ్య రాణి, భాను ప్రసాద్ పాల్గొన్నారు.
సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ కమిటీ ఆవిర్భావం





