- పరువునస్టం కేసులో హైకోర్టు తీర్పు నిలిపివేత
- పార్లమెంట్ ఎంపి పదవి పునరుద్దిరంచే అవకాశం
న్యూ దిల్లీ,ఆగస్ట్4(ఆర్ఎన్ఎ): ’మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేసింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. 2019లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్కు చెందిన పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ దోషి అని తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై పూర్ణేశ్ మోదీ గుజరాత్లోని సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కోర్టు గాంధీని దోషిగా తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టులో కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది. ఆయనను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపేసింది.
దీంతో పరువు నష్టం దావా కేసులో ఎట్టకేలకు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సుప్రీంకోర్టు తీర్పుతోనే రాహుల్ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందన్న వాదనల నేపథ్యంలో సర్పోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కి ఉపశమనం కలిగించింది. కోర్టులో రాహుల్ తరపున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసిన పూర్ణేష్ మోదీ ఇంటి పేరు ’మోదీ’ కాదని, అది భూటాల అని వివరించారు. అలాంట ప్పుడు ఇది పరువు నష్టం కిందకు ఎలా వస్తుందని వాదించారు. దేశంలో మోదీ ఇంటి పేరుతో 13 కోట్ల మంది ఉన్నారని, కానీ కేవలం బీజేపీకి చెందిన వాళ్లు మాత్రమే దీనిపై అనవసరంగా రియాక్ట్ అవుతున్నారని అన్నారు. ఈ కేసులో కావాలనే రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష వేశారని ఆరోపించారు. ఈ కారణంగా ఆయన 8 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, ఇదంతా కుట్ర అని వాదించారు సింఘ్వీ. ఈ కేసు కారణంగా రాహుల్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారని వివరించారు.
ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు…రాహుల్ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధించింది. రాహుల్కి రెండేళ్ల జైలు శిక్ష విధించడానికి సరైన కారణమేదీ ట్రయల్ కోర్టు చూపించలేదని జస్టిస్ పీకే మిశ్రా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన కాస్త అభ్యంతరకరంగా మాట్లాడారన్నది వాస్తవమే. పబ్లిక్ లైఫ్లో ఉండే వ్యక్తులు ప్రసంగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయినా…ట్రయల్ కోర్టు జడ్జ్ రాహుల్ రెండేళ్ల జైలు శిక్ష వేయడానికి కారణమేంటన్నది స్పష్టంగా చెప్పలేదు. ఇంత గరిష్ఠ శిక్ష వేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు. ఒక్క రోజు శిక్ష తగ్గించి వేసినా రాహుల్ ఎంపీ సభ్యత్వం కోల్పోయి ఉండే వారు కాదని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రాహుల్ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ’ఈ వాదనలు పరిశీలించిన తరవాత రాహుల్కి గరిష్ఠ శిక్ష వేయడానికి గల కారణాలను ట్రయల్ కోర్టు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. అందుకే…రాహుల్ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం అని ధర్మాసనం ప్రకటించింది.
సోమవారం పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ ..?
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్:
క్రిమినల్ పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ను దోషిగా నిలిపివేసి, సభా సభ్యత్వం పునరుద్ధరణకు మార్గం సుగమం చేయడంతో ఆయన సోమవారం పార్లమెంటుకు తిరిగి రావడానికి అర్హులని ఇద్దరు అధికారులు తెలిపారు. కోర్టు నిర్ణయంతో గాంధీ సస్పెన్షన్ను తొలగించినట్లు పునరుద్ధరణకు ముందు లోక్సభ సెక్రటేరియట్ నోటీసు జారీ చేయాలని అధికారులు తెలిపారు.సచివాలయం కోర్టు ఉత్తర్వుల కాపీని పొందిన తర్వాత మాత్రమే సస్పెన్షన్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తుంది. ‘‘ఆర్డర్ను అధ్యయనం చేసి, ఆపై నిర్ణయం తీసుకోబడుతుంది’’ అని లోక్సభ అధికారి ఒకరు తెలిపారు.
బిజెపి కుట్రలు చిత్తు:రేవంత్
హైదరాబాద్,ఆగస్ట్4: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిస్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలువేసిన కేసులలో సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని.. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయని అన్నారు. కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాలీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గమని మండిపడ్డారు. సుప్రీం కోర్ట్ తీర్పు పట్ల దేశంలో హర్షాతిరేకం వ్యక్తం అవుతోందన్నారు.
న్యాయం గెలిచిందని… ప్రజల్లో చట్టం, న్యాయం పట్ల మళ్ళీ విశ్వాసం పెరిగిందన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలిచారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ ప్రజల విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. తాము న్యాయస్థానాన్ని నమ్ముకుని ఉన్నామన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయం గెలిచిందని తెలిపారు. సుప్రీంకోర్టు స్టేతో తమకు, తమ కార్యకర్తలకు ఎంతో ధైర్యం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ గొంతునొక్కాలనుకున్న బీజేపీకి సుప్రీం తీర్పు ఓ హెచ్చరిక అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వెల్లడించారు.



