- ట్విట్టర్లో స్పందించిన పిసిసి చీఫ్ రేవంత్
- మిటిటరీ ప్రవేటీకరణలో భాగమే అగ్నిపథ్ : కాంగ్రెస్ నేత మధుయాష్కీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన దాడి ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రోజు జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇదని పేర్కొన్నారు.
దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. మరోవైపు సికింద్రాబాద్ ఘటనతో ఎన్ఎస్యూఐకి సంబంధం లేదని అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రకటించారు.
మిటిటరీ ప్రవేటీకరణలో భాగమే అగ్నిపథ్ : కాంగ్రెస్ నేత మధుయాష్కీ
దేశ భద్రతకు వెన్నుముకలా నిలిచిన మిలటరీని ప్రైవేటీకరించే సన్నాహాల్లో భాగంగా తీసుకువస్తున్న అగ్నిఫథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన యువకుల ఆందోళనల్లో భాగంగా పోలీసులు కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మరణించడం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందని, రాకేష్ మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలన్నారు.
ఒన్ ర్యాంక్ ఒన్ ఫెన్షన్ పథకానికి మంగళం పాడేలా నో ర్యాంక్.. నో ఫెన్షన్ పథకం అమలు చేయడంలో భాగంగా అగ్నిపథ్ కేంద్రం తీసుకువస్తోంది. మిలట్రీని ప్రైవేటీకరించడంతో పాటు, సైనిక విభాగాల్లో జీతభత్యాలు, ఇతర ఖర్చలు తగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనతోన కేంద్రం ఈ పథకం తీసుకువస్తోంది. దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కాలంనుంచి ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం యువత ఎదురు చూస్తోంది. రెగ్యులర్ రిక్రూట్ మెంట్ చేయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అగ్నిపథ్ పేరుతో రిక్రూట్ మెంట్లు చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.
సికింద్రాబాద్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీఛార్జీ, కాల్పులు జరపడం అత్యంత అమానుషం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువకుల సహనాన్ని ఇంకా పరీక్షించకుండా వెంటనే రిక్రూట్ మెంట్ మొదలు పెట్టాలని యాష్కీ డిమాండ్ చేశారు.




