సంపద ప్రజలకు చెందాలంటే…ప్రజల తెలంగాణ గెలవాలి

సంపద ప్రజలకు చెందాలంటే…ప్రజల తెలంగాణ గెలవాలి
ప్రభుత్వం మెడలు వంచి మధిరను అభివృద్ధి చేశాను
తెలంగాణ ప్రజల కలలను కల్లలుగా చేసిన బిఆర్‌ఎస్‌
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

మధిర, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ప్రభుత్వం మెడలు వంచి మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ముదిగొండ మండలం యడవెల్లి గ్రామంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ..దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే ప్రజల తెలంగాణ గెలువాలన్నారు. తెలంగాణ ప్రజల కలలను కల్లలుగా చేసిన బిఆర్‌ ఎస్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి ప్రజల ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్ర సంపద ప్రజలకు పంచుదామన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బాగుపడతాయని రాష్ట్ర ప్రజలు కలలుగన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల కలలు నిజం చేయడానికి కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి అడ్డంగా నిలబడిన దొరలు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పాలకులు ప్రజల సంపదను లూటీ చేయడంతో ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో ప్రజల ప్రభుత్వం గెలవాలని చెప్పారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టులు, ఇండ్లు, ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక సార్ధకత వొచ్చి ఉండేదన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడం, భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని.. మహిళలకు 500 రూపాయలకే సిలిండర్‌, ప్రతినెల మహిళలకు 2,500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇవన్నీ కలిపి నెలకు 5000 రూపాయల వరకు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్‌ పార్టీ గ్యారెంటీ ప్రకటించిందని గుర్తుచేశారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. చదువుకునే యువతకు ఐదు లక్షల క్రెడిట్‌ కార్డు ఇస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్స్‌ వరకు ఉచితంగా కరెంటు అందిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులు ప్రజల సంపదను దోపిడీ చేశారు కాబట్టే.. ఇలాంటి పథకాలను అమలు చేయలేకపోయారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో ప్రజల సంపద ప్రజలకే ఖర్చు పెడుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దోపిడీ ఉండదు. నిధుల మిగులు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు తీసుకురావడానికి రాబడిని ఎక్కడి నుంచి తీసుకురావాలో తమకు తెలుసన్నారు. రైతులకు రుణమాఫీతో పాటు రాహుల్‌ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రకటించిన డిక్లరేషన్స్‌ మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేస్తామన్నారు. దాచుకొని దోచుకునే బిఆర్‌ఎస్‌ పాలకుల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు తెలంగాణ అన్నారు. సమాజం నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొస్తేనే తెలంగాణ వికాసం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం నిధుల గురించి లెక్కలు తీసి ప్రభుత్వాన్ని నిలదీసి, దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో పోరాడితే వచ్చింది దళిత బంధు పథకం అన్నారు. దారి పొడవునా భట్టి విక్రమార్క పై బంతిపూల వర్షం కురిపిస్తూ అభిమానం చాటుకున్నారు. మేడిపల్లి గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీలో మహిళలు, యువకులు, రైతులు పాల్గొన్నారు.
………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *