- వృత్తి నిపుణులుగా గుర్తింపు…జాబితాలో చేర్పు
- ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం…ఆదేశాలు
అమలాపురం, జూన్ 28 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలురైతులకు అండగా కీలక నిర్ణయం తీసుకుంది. వారిని వ్యవసాయ వృత్తి నిపుణులుగా గుర్తించింది. ప్రైవేటు ఉద్యోగులతోపాటు వ్యవసాయ రంగంలోని కౌలు రైతులను కూడా వృత్తి నిపుణుల జాబితాలో చేర్చారు. ఇతర వృత్తి నిపుణులకు ఇస్తున్న మాదిరిగానే ఇకపై కౌలుదారులను కూడా అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ గా గుర్తిస్తూ.. ఇకపై వీరికి కూడా వ్యక్తిగత రుణాలు అందించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
పంట భూమి లేకపోయినా, వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ గా గుర్తించి జిల్లా యంత్రాంగం రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టింది. కౌలు కార్డులు ఉన్నప్పటికీ రుణాలు అందుకోలేక ఇబ్బందులు పడుతున్న కౌలుదారుల దుస్థితిని గుర్తించిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం రైతుల పేరిట సెంటు భూమి లేకున్నా… సంబంధిత వీఆర్వో, వీఏవోలు, తహసీల్దార్ సిఫార్సు మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రుణాలు మంజూరు చేసింది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో తొలి విడతగా 10 మండలాల్లోని 10 గ్రామాలను ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో 540 మంది అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ కు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో 323 మందికి మంగళవారం రుణాలు అందజేశారు. కొత్తపేట మండలం అవిడిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపిక చేసిన రైతులకు రూ.1,40,58,100 చెక్కు రూపంలో అందజేశారు.




