– తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్
– ఛైర్మన్ అండ్ ఎం.డిగా ముషారఫ్ అలీ ఫరూఖీ
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి11: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలో మూడో డిస్కమ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ సంస్థలకు అదనంగా కొత్త డిస్కమ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త సంస్థకు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనే పేరు పెట్టారు. దీనిని సాధారణంగా ’రైతు డిస్కమ్’గా కూడా పిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ సంస్థను కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం నమోదు చేయనున్నారు. హైదరాబాద్లోని మింట్ కంపౌండ్ ప్రాంతంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త డిస్కమ్కు ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీను ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. విద్యుత్ రంగంలో ఆయనకు ఉన్న పరిపాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త సంస్థ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. ’రైతు డిస్కమ్’ ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యుత్ సరఫరాను చూసుకుంటుంది. వ్యవసాయ కనెక్షన్లు, లిప్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ వంటి తాగునీటి పథకాల కోసం అవసరమైన విద్యుత్ సరఫరాను ఈ సంస్థ నిర్వహించనుంది. అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అవసరాలకు కూడా విద్యుత్ అందించే బాధ్యత ఈ సంస్థపై ఉంటుంది.ఈ సంస్థ ద్వారా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయడం, ట్రాన్స్ఫార్మర్లు , విద్యుత్ లైన్ల నిర్వహణ వంటి పనులు చేపడతారు. అదేవిధంగా విద్యుత్ వినియోగాన్ని లెక్కించడం, మీటర్ల నిర్వహణ చేయడం, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం వంటి బాధ్యతలను కూడా ఈ సంస్థ నిర్వర్తిస్తుంది. కొత్త సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరిలో తిరుపతి రెడ్డి, పీ. కృష్ణారెడ్డి, వంగూరు మోహన్ రావు, ఎన్. నరసింహులు వంటి అధికారులు డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, భారీ సాగునీటి ప్రాజెక్టులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థపై భారం పెరుగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ’రైతు డిస్కమ్’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.