తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం అధికారికంగా జరపక పోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని, అలాంటి అమరవీరుల త్యాగాలను కేసీఆర్ విస్మరించటం తగదు అని హెచ్చరించారు, విమోచన దినం కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తరుపున తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తప్ప, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అవినీతి తప్ప అభివృద్ధి లేదని తేల్చి చెప్పారు. ఎన్ఆరైలు అందరు ఎన్నికలప్పుడు భారత దేశానికి వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఇండియాను భారత్గా ప్రస్తావించాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు. దీనికి బీజేపీ మద్దతుదారులు, ఎన్నారైలు స్వాగతించారు. తెలంగాణ రావడానికి ముఖ్య కారణం సుస్మా స్వరాజ్ , తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం చనిపోతూ ఉంటె , మీరు చనిపోవద్దు, మీ బలిదానాలు వద్దు , తెలంగాణ వస్తది, వచ్చిన తెలంగాణ ను మీరు బతికి ఉండి చూడాలి అని సుస్మా స్వరాజ్ చెప్పారు అని గుర్తు చేసారు బండి సంజయ్.




