ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే
కాలనీ వాసులు నిర్మించుకున్న ప్రహరీ గోడ కూల్చివేత
అడ్డుకున్న కాలనీ వాసి, సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ కు బెదిరింపులు
కూల్చివేసిన ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని కాలనీ వాసుల డిమాండ్
ఆందోళన ఉదృతం
పలు పార్టీలు, ప్రజా, దళిత సంఘాల మద్దతు
సంగారెడ్డి, ప్రజాతంత్ర : సంగారెడ్డి పట్టణంలో ని 13వ వార్డు ఆదర్శ జెమాక్స్ కాలనీ వాసులు సొంతంగా నిర్మించుకున్న ప్రహరీ గోడను శుక్రవారం ఉదయం మున్సిపల్ అధికారులు, పోలీసులు కలిసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే అక్రమంగా కూల్చివేశారు. కాలనీ వాసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు, పోలీసులు వచ్చి ప్రహరీ గోడను జెసిబి తో కూల్చివేయడాన్ని కాలనీ వాసులు తీవ్రంగా తప్పు పట్టారు. ఆపాలని అడిగినా కాలనీ వాసి, సీనియర్ జర్నలిస్ట్ ఎల్గొయి ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయంటూ డిఎస్పీ బాలాజీ దగ్గర ఉండి కూల్చివేయించారు. కూల్చివేత ను అపాలని కోరిన వినిపించుకోలేదు. పోలీసులు ప్రభాకర్ ను చుట్టుముట్టారు. బెదిరించారు. అదనపు కలెక్టర్ నోటీసులో ఈ విషయం ఉందని, ఫోన్లో మాట్లాడాలని ప్రభాకర్ ఎంత చెప్పినా డిఎస్పీ వినిపించుకోలేదు. అనుమతి లేని వెంచర్ కు మున్సిపల్ అధికారులు, సంగారెడ్డి డిఎస్పీ బాలాజీ వత్తాసు పలుకడం ఎంత వరకు సబబు అని కాలనీ వాసులు అంటున్నారు. ల్యాండ్ మాఫియా తో కుమ్మక్కు అయి సంగారెడ్డి లోనే ఆదర్శమైన కాలనీ కి చెడ్డ పేరు తీసుకొచ్చారని అంటున్నారు. కనీసం వెంచర్ డాక్యుమెంట్ పరిశీలించకుండానే అక్రమ వెంచర్ దారులకు మున్సిపల్ అధికారులు, పోలీసులు అండగా నిలబడడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఉన్న ల్యాండ్ మాఫియాపై నా, ఇందుకు వత్తాసు పలికిన మున్సిపల్, పోలీసు అధికారి పైనా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కాలనీ రోడ్డు పక్కన షటర్స్ వేసి కమర్షియల్ గా వాడాలని చూస్తున్నారని, దీ%శీ%తో కాలనీ వాసులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైవుతాయని, మహిళలు ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని, ప్రభాకర్ ను బెదిరించిన డిఎస్పీ క్షమాపణ చెప్పాలని, ల్యాండ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాలనీ వాసులకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా, దళిత సంఘాలు మద్దతు తెలిపాయి.



