లిక్కర్‌ స్కామ్‌లో బోయినపల్లి అభిషేక్‌కు ఊరట

 మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

న్యూదిల్లీ,మార్చి20: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్‌ రావుకు స్వల్ప ఊరట లభించింది. సుప్రీం కోర్టు బుధవారం అభిషేక్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉందన్న కారణంగా ఐదు వారాల బెయిల్‌ను మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అభిషేక్‌ను హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించిన సుప్రీం కోర్టు.. పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలని.. ఆయన ఫోన్‌ నెంబర్‌ ఈడీ అధికారులకు ఇవ్వాలని, అలాగే ఆయన భార్యకు హైదరాబాద్‌లోనే చికిత్స అందించాలని షరతులు విధించింది.

అలాగే మిగిలిన బెయిల్‌ నిబంధనలను ట్రయల్‌ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంటుందని తెలిపింది.  ఈ సందర్భంగా.. ట్రయల్‌ కోర్టు విచారణపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈడీ కేసుల్లో ట్రయల్స్‌ జాప్యంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్స్‌ జాప్యం జరిగితే నిందితులు నెలల తరబడి జైల్లోనే ఉండాల్సి వస్తుంది కదా? అని ప్రశ్నించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్‌ 29వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్‌ స్కామ్‌లో 2022 అక్టోబర్‌లో అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *