నాలుగు రెట్లు పెరిగాయన్న నిర్మల
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర బడ్జెట్లో రైల్వేలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పెద్ద పీట వేశారు. కొత్త రైల్వేల లైన్ల ఏర్పాటు, రైల్వేల ఆధునీకరణ, శతాబ్ది ఎక్స్ప్రెస్ల రాకతో బడ్జెట్ను భారీగా పెంచారు. దాదాపు ఓ దశాబ్దంలో అత్యధికంగా, గత ఏడాది కన్నా నాలుగు రెట్ల వరకు ఈ రైల్వే బడ్జెట్ ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టడానికి ముందు యూపీఏ ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ వ్యయం చేయబోతున్నట్లు నిర్మల తెలిపారు. పార్లమెంటులో నిర్మల సీతారామన్ బ్జడెట్ ప్రసంగం చేస్తూ, 2013-14 బ్జడెట్లో రైల్వేలకు కేటాయించినదాని కన్నా తొమ్మిది రెట్లు, అంటే రూ.2.4 లక్షల కోట్లు 2023-24 బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు.
రైల్వేల అభివృద్ధికి దోహదపడే మరొక పథకాన్ని కూడా ఆమె ప్రకటించారు. 100 క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రాజెక్టస్ను ఏర్పాటు చేయనున్నట్లు, వీటి కోసం రూ.75,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నౌకాశ్రయాలు, బొగ్గు క్షేత్రాలు, ఎరువుల కంపెనీలు, ఆహార ధాన్యాల గోదాములు వంటివాటిని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తారు. రూ.15,000 కోట్ల పెట్టుబడులను సేకరించేందుకు ప్రైవేట్ రంగం సహకారం కూడా తీసుకుంటారు.ఇదిలావుండగా, మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే నివేదిక రైల్వేలను అభినందించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రయాణికులు, సరుకు రవాణా రంగాల్లో రైల్వేలు తిరిగి కోలుకున్నాయని ఈ నివేదిక తెలిపింది. మరోవైపు ప్రభుత్వం కూడా రైల్వేలకు తగిన నిధులను అందజేసినట్లు పేర్కొంది.




