- అంతా మంచిగా ఉంటే ఎందుకీ బెరుకు
- విద్యుత్ కోతలపై ఎందుకీ బుకాయింపు
- సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శ
- 24 గంటల కరెంట్పై అబద్దాలు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంపై సీఎల్పీ భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మండిపడ్డారు. అసెంబ్లీ వి•డియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన…రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని అన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామంటున్న ప్రభుత్వం కనీసం నాలుగు గంటలు కూడా ఇవ్వడంలేదని వాపోయారు. నాలుగు గంటలైనా కోతలు లేకుండా చూడాలని కోరారు. ఇదే విషయంపై చర్చ కోసం గొంతు పోయేలా అరిచినా స్పీకర్ పట్టించు కోవడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళన చేస్తున్నా స్పీకర్ కనీసం తమవైపు చూడటం లేదని అందుకే నిరసన తెలిపుతూ సభ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. గంటల తరబడి ప్రసంగాలు, బడాయి మాటలుతప్ప బడ్జెట్లో ఏవి•లేదని భట్టివిక్రమార్క విమర్శించారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే! అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచదేశాల ఇంజినీర్లంతా చూసి మెచ్చుకుంటున్నారని చెబుతున్నారని, మరి ప్రతిపక్షాలను ఎందుకు చూడనీయటంలేదని ప్రశ్నించారు ’మేము చూస్తే అవినీతి బయటికి వస్తుందన్న భయమా అని అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి, కృష్ణా, మంజీరా నదుల నుంచి హైదరాబాద్కు తాగునీటిని తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ఇందులో బీఆర్ఎస్ గొప్పతనం ఏవి•లేదని అన్నారు. రోజుకు నాలుగున్నర గంటల నుంచి 5 గంటలకు మించి త్రీఫేజ్ కరెంటు రావటం లేదన్నారు.
24 గంటల కరెంట్పై అబద్దాలు : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
విద్యుత్పై అసెంబ్లీలో మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీ వి•డియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ మాట్లాడుతూ…24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు సభలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కనీసం 8, 9 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ సభ్యులు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని…అప్పుడైనా ధర్నాలు కనపడతాయని ఎద్దేవా చేశారు.
కరెంటు కోతల నిజం తెలుసుకునేందుకు గ్రామాలకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా…మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. కనీసం రోజుకు 13 గంటల కరెంటు ఇచ్చి.. రైతులను ఆదుకోవాలన్నారు. కరెంటు కోతలపై శాసనమండలిలో చర్చ జరగాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.




