- కోరుట్ల నియోజకవర్గంలో బండలింగాపూర్ మండలంగా ఏర్పాటు
- జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో నియోజకవర్గాలకు అదనంగా రూ.10 కోట్ల ఎమ్మెల్యే ఫండ్
- వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నూతన లిఫ్ట్లు మంజూరు
- తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1
- దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి
- రూ. 14 వేల కోట్ల ఖర్చుతో 24 గంటల ఉచిత విద్యుత్
- సబ్ కా సాత్..సబ్ కా వికాస్..సోబ్ బక్వాస్
- 10 వేల పరిశ్రమలు మూత.. 50 లక్షల ఉద్యోగాలు ఊస్ట్.. ఎక్కడ మేకిన్ ఇండియా?
- మత పిచ్చిలో పడి మోసపోకండి
- కేంద్ర విధానాల వల్ల తెలంగాణకు 3 లక్షల కోట్ల నష్టం
- సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించి మోతెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : రూ.100 కోట్ల ప్రత్యేక నిధులతో కొండగట్టును దేశం ఆశ్చర్య పోయె పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. జగిత్యాల జిల్లాలో 49 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించి టీఆర్ఎస్ జగిత్యాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం 510 కోట్లతో చేపట్టిన జగిత్యాల మెడికల్ కాలేజీ, హాస్పిటల్ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపన, జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంపులో రూ.49 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి పూజా కార్యక్రమాల అనంతరం కలెక్టరేట్ను ప్రారంభించారు. కలెక్టర్ చాంబర్లో జరిగిన పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి రవికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. అనంతరం సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం మోతె గ్రామం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగిత్యాల జిల్లా ఏర్పడడంతో పాటు నూతన కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్ ఏర్పాటైన సందర్భంగా సీఎం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల మాత్రమే జగిత్యాల ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించడం, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యమ సమయంలో ధర్మపురి వద్ద పుష్కర స్నానం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రార్థించడం జరిగిందని, లక్ష్మీ నరసింహస్వామి దయ, ధర్మపురి బ్రాహ్మణుల దీవెనలు నెరవేరి మనం ప్రత్యేక రాష్ట్రం సాధించామని అన్నారు.
గోదావరి నది తెలంగాణలో ప్రారంభమైనప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు పుష్కరాలు నిర్వహించలేదని, ప్రత్యేక రాష్ట్రంలో ఘనంగా పుష్కరాలు నిర్వహిస్తే కోట్లాది మంది భక్తులు వొచ్చి పుష్కర స్నానాలు చేశారని, మంత్రి హరిష్ రావు క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలిస్లా సేవలు అందించిన అంశాలను సీఎం గుర్తు చేశారు. కొండగట్టు దేవాలయానికి కేవలం 20 ఎకరాల స్థలం మాత్రమే ఉందని, నూతన రాష్ట్రంలో పక్కన ఉన్న 384 ఎకరాలను సైతం దేవాలయానికి అందించామని, పెరుగుతున్న ఆంజనేయ భక్తులను దృష్టిలో ఉంచుకొని కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ, త్వరలో శాస్త్రాల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని, కోరుట్ల నియోజకవర్గ పరిధిలో బండలింగాపూర్ గ్రామంలో ఉద్యమ సమయంలో పర్యటించి నైట్ హాల్ట్ నిర్వహించడాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకుంటూ బండలింగాపూర్ గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎండిపోయిన వరద కాలువను జీవనదిలా మార్చామని, అవసరమైన తూములు ఏర్పాటు చేసి వేల సంఖ్యలో చెరువులు నింపామన్నారు. 14 వేల కోట్ల ఖర్చు చేస్తూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని అన్నారు. ప్రపంచంలోనే రైతు బంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక ప్రాంతం తెలంగాణ మాత్రమేనని అన్నారు. రైతులు బాగుపడే వరకు, కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బీమా పథకాలు కోనసాగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. యాసంగి సీజన్లో మరో 10 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 7వేల కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వేములవాడలో 3 లకు సాగునీరు అందించేందుకు సూరమ్మ చెరువు లిఫ్ట్, చొప్పదండి నియోజకవర్గ పరిధిలో మల్యాల మండలం మద్దుట్ల గ్రామం వద్ద లిఫ్ట్ పనులను త్వరలో మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడి కార్మికులు ఉన్నారని, ఎక్కడా లేనివిధంగా వందల కోట్ల ఖర్చు చేస్తూ బీడి కార్మికులకు నెలకు 2016 పెన్షన్ పంపిణీ చేస్తున్నామని, వీటితో పాటు ఆరోగ్యశ్రీ కల్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. పోతారం, నారాయణపూర్ రిజర్వాయర్ పనులు, ధర్మపురి నియోజకవర్గంలో రొల్ల వాగు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందని, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యేలకు అదనంగా 10కోట్ల ఫండ్ మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు తెలంగాణ ప్రాంత ప్రజలు దేశంలో జరుగుతున్న అంశాలను పరిశీలించాలని, తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ రాజకీయాలను మనం ప్రభావితం చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా నినాదంగా మాత్రమే మిగిలిపోయిందని, దీపావళి పటాసులు, పతంగి మంజాలు, చివరికి జాతీయ జెండాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా నినాదాలు చేస్తూ ప్రతి ఊరిలో చైనా బజార్లు ఉన్నాయని వీటి పై మేధావులు, యువకులు, మహిళలు, ఉపాధ్యాయులు చర్చించాలని సీఎం కేసీఆర్ కోరారు.
పబ్లిక్ సెక్టార్ యూనిట్లను విక్రయిస్తూ, 35 లక్షల కోట్ల ఆస్తి కల్గిన ఎల్ఐసి విక్రయానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, గత 8 సంవత్సరాల కాలంలో బడా బాబులకు 14 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఏ రుణాలు మాఫీ చేయడం జరిగిందని, 10 వేల ఫ్యాక్టరీ మూతబడ్డాయని, 50 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎం కేసిఆర్ అన్నారు. 25 లక్షల ఏజెంట్లు కల్గిన ఎల్.ఐ.సి విక్రయాన్ని వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. లక్షల కోట్ల ప్రజా సంపదతో ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అంగీకరించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు వల్ల తెలంగాణ రాష్ట్రం దాదాపు 3 లక్షల కోట్ల నష్టపోయిందని, తెలంగాణ రాష్ట్రం తరహాలో కేంద్ర ప్రభుత్వం పని చేస్తే మన జీఎస్డిపి 14.5 లక్షల కోట్లకు చేరేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, చుట్టూ జరుగుతున్న విషయాల్లో వాస్తవాలను గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగూల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేతకాని, శాసనమండలి సభ్యులు టి. భాను ప్రసాద్ రావు, ఎల్ .రమణ, కల్వకుంట్ల కవిత, పాడి కౌశిక్ రెడ్డి, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ,కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




