- విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్టు ధర్మాసనం
- గుజరాత్ ప్రభుత్వానికి, పూర్ణేష్ మోదీకి నోటీసులు
- ప్రత్యర్థలు వాదనలూ వినాలన్న ధర్మాసనం
- విచారణ ఆగస్ట్ 4కు వాయిదా
న్యూ దిల్లీ, జూలై 21(ఆర్ఎన్ఎ) : రాహుల్ గాంధీ పరువు నష్టం దావా కేసులో మరో కీలక పరిణామం జరిగింది. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అప్పీలుపై విచారణను సుప్రీమ్ కోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది. రాహుల్ని దోషిగా తేల్చడంపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్టు నోటీసులు ఇచ్చింది. రాహుల్పై పిటిషన్ వేసిన పూర్ణేష్ మోదీకి కూడా ఈ నోటీసులు పంపింది. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్పై సుప్రీమ్ కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్ని ఒకే వైపు నుంచి కాకుండా రాహుల్ వైపు నుంచి కూడా పరిశీలించాలని జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఈ కేసు వల్ల 100 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తరుపున వాదిస్తున్న సింఘ్వీ గుర్తు చేశారు.
శిక్ష పడిన కారణంగా చివరి పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరు కాలేకపోయారని… ఇప్పుడు కొనసాగుతున్న సమావేశాలకూ వెళ్లేందుకు అర్హత లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టుకి వాయిదా వేసింది. దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించడం నేరమేనని సూరత్ కోర్టు నిర్ధరించి, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించడంతో, ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో అపీలు చేశారు. సూరత్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టు ఇటీవల సమర్థించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీమ్ కోర్టులో అపీలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ , జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. పరువునష్టం కేసు దాఖలు చేసిన పూర్ణేశ్ మోదీకి, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు నాలుగున జరుగుతుందని తెలిపింది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, తన తండ్రికి, సోదరునికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని, తాను ఈ విచారణ నుంచి తప్పుకుంటానని చెప్పారు.
తన తండ్రి కాంగ్రెస్ సభ్యుడు కాకపోయినప్పటికీ, ఆ పార్టీతో ఆయనకు అనుబంధం ఉందన్నారు.
సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్విని ఉద్దేశించి మాట్లాడుతూ, సింఘ్వి, కు కాంగ్రెస్తో నలభయ్యేళ్లకుపైగా అనుబంధం ఉంది. మా సోదరుడు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. నేను ఈ పిటిషన్పై విచారణ జరపాలని కోరుకుంటున్నారా? నిర్ణయం తీసుకోండి అన్నారు. రాహుల్ గాంధీ తరపున వాదనలు వినిపిస్తున్న సింఘ్వి మాట్లాడుతూ, ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ప్రతివాదుల తరపు న్యాయవాది కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. సింఘ్వి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ 11 రోజుల నుంచి బాధపడుతున్నారని, ఓ పార్లమెంటు సెషన్ను కోల్పోయారని, మరో సెషన్ను కోల్పోబోతున్నారని కోర్టుకు తెలిపారు. వయనాద్ లోక్ సభ నియోజకవర్గం ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయని చెప్పారు. లోక్ సభ సభ్యత్వానికి రాహుల్ గాంధీని అనర్హుడిని చేయడాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని కోరారు. దీనిపై సుప్రీమ్ కోర్టు స్పందిస్తూ, ప్రతివాదుల వాదనలను కూడా తాము వింటామని, తాత్కాలిక ఉపశమనాన్ని మంజూరు చేయలేమని తెలిపింది.



