- అమరుల కుటుంబాలను ఆదుకోలేదు
- డాక్టర్ ప్రీతి చావుకు కారణమైన ప్రభుత్వాన్ని గద్దె దించాలి
- పేద ప్రజలు వెళ్లని ప్రగతి భవన్ ఎందుకు?
- కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి రాష్ట్రంలో కనబడుతున్నది
- తొమ్మిదేళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదు
- పరకాల పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
చిట్యాల(పరకాల), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన 1200 మంది అమరుల కుటుంబాలను పరామర్శించని కల్వకుంట్ల కుటుంబ పాలన మనకు అవసరమా? అని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను సూటిగా ప్రశ్నించారు. నాలుగు కోట్ల ప్రజలు మా కుటుంబమే అంటున్న కేసీఆర్, కేటీఆర్ లు దగుల్బాజీలన్నారు. రాష్ట్రంలో వరంగల్ కు చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతి చెందితే పరామర్శించని కేసీఆర్, నగరంలో బాలున్ని కుక్కలు పీకుతుంటే కనీసం పరామర్శించని కేటీఆర్ ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న రాక్షసులన్నారు. ఆ ఇద్దరు రాక్షసుల ప్రాణం దయాకర్ రావు, ధర్మారెడ్డి, రమేష్ రాజయ్య లాంటి ఎమ్మెల్యేల చేతుల్లో బందీగా ఉందన్నారు. రామచిలకలను పిసికితే రాక్షసుడు అంతమవుతాడని రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లతో బుద్ధి చెప్పి రాక్షసుడి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు.
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం పరకాల నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి రాత్రి పరకాల పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్నర్ సభలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఫలితాన్ని మాత్రం కల్వకుంట్ల కుటుంబం అనుభవిస్తున్నదన్నారు. తొమ్మిదేళ్ల కల్వకుంట్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగులు బలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ నెరవేరుతాయని హామీ ఇచ్చారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కల్వకుంట్ల కుటుంబం పరిపాలిస్తూ బడ్జెట్లో కేటాయించిన 23 లక్షల కోట్లను ఏం చేసిందో నిరూపించాలన్నారు. లక్షల కోట్లు వాడుకుని వేల ఎకరాల ఆస్తులు కూడా పెట్టిన కేసీఆర్ ను బొంద పెట్టాలన్నారు. మూడు రోజుల క్రితం భూపాలపల్లి సభలో కెసిఆర్ కొడుకు రామారావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలనలో ఏమి చేసిందని అన్నాడని, తన కనులకు పొరలు కమ్మితే వరంగల్ ఏకశిలా పార్కులో చర్చకు రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందేమిటో లెక్కలతో సహా చూపిస్తామని వివరించారు. ఉచిత విద్యుత్తు, బడి, గుడితో పాటు రోడ్లు కూడా వేసింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ తో పాటు ప్రాణహిత, చేవెళ్ల, శ్రీరామ్ సాగర్, దేవాదుల ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్సేనని వివరించారు.
రామారావుకి తెలవకుంటే ఆయన తండ్రిని అడిగి తెలుసుకోవాలని ఇతవు పలికాడు. శ్రీకాంతాచారి, కృష్ణయ్య లాంటి అమరుల కుటుంబాలను ఏనాడు పరామర్శించని కేసీఆర్ ముఖ్యమంత్రిగా మనకు అవసరమా అని ప్రజలను అడిగాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ. 500 కే వంట గ్యాస్ ఇవ్వడమే కాకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని తిరిగి ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తామన్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.




