రాజ్యాంగాన్ని అవమానిస్తున్న మోదికి గుణపాఠం తప్పదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 13 : రాజ్యాంగాన్ని అవమానిస్తున్న నరేంద్ర మోదికి గుణపాఠం తప్పదని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ హెచ్చరించారు. ఎస్సీల వర్గీకరణ చెల్లదని అది రాజ్యాంగ స్పూర్తికి దళితుల ఐక్యతకు తీవ్రంగా నష్టం చేస్తుందన్నారు. 2004లో భారత అత్యున్నత న్యాయ వ్యవస్థ తీర్పునిస్తే దాన్ని కాదని, భారత ప్రభుత్వ సామాజిక న్యాయశాఖ శాఖ మంత్రులు సహాయ కేంద్ర మంత్రులు కూడ వర్గీకరణ జరగదని నిండు పార్లమెంట్ సమావేశాలలో ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ టిఆర్ఎస్, బిజెపి ఎంపీలు అడిన ప్రశ్నలకు వివరణ ఇచ్చిన తర్వాత కూడ కేవలం ఎన్నికల ప్రక్రియలో బాగంగా తెలంగాణలో మాల మాదిగల మద్య మణిపూర్ లోని కుకీ మయితేయి తెగల మద్య జరిగిన హింసను, మారణహోమాన్ని రగిలించుటకోసం మోది మందకృష్ణ జరుపుతున్న వర్గీకరణ సభకు హైదరాబాద్ వచ్చారన్నారు. దీనికి నిరసనగా మాల మహనాడు జాతీయ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ నేత పబ్బతి శ్రీకృష్ణ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 8 గంటల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మోదీ ప్రధానిగా ఉండి వేలాది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను గుజరాత్ వ్యాపారులకు అమ్మేసిన ఆయన ఎస్సీలకు ఎక్కడ ఏ ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తారో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు..తమ రాజకీయ ప్రయోజనాలు తప్ప ఎస్సీల వర్గీకరణ జరగదన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఎంపీలు, రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే తప్ప సాధ్యం కాదన్న విషయాలు మందకృష్ణకు మోదీకీ తెలుసు కాని డబ్బులు, పదవి కోసం మందకృష్ణ మాదిగల ఓట్ల కోసం మోదీ బిజెపి పార్టీలు మాదిగలను తీవ్రంగా మోసం చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో మాదిగలు మోసపోవద్దని, అదేవిధంగా బిజెపిలోని మాలలు బయటకు రావాలని తెలంగాణలోనే కాదు మొత్తం దేశంలో బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఆమరణ నిరాహార దీక్షలో రాష్ట్ర నాయకులు సంకి ప్రసాద్, అవుట శ్రీను, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *