- బిజెపి కార్యాలయం దాటుతూ ముద్దులు విసిరిన కాంగ్రెస్ నేత
- పాదయాత్రలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 6 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలో హుషారుగా కొనసాగుతున్నది. సోమవారం రాత్రి బస చేసిన ఖేల్ సంకుల్ నుంచి మంగళవారం ఉదయం యాత్ర ప్రారంభించి ఝాలావర్ నగరం మీదుగా 12 కిలో మీటర్ల మేర ముందుకు సాగి ఉదయం పది గంటల ప్రాంతంలో దేవరిఘాటకు చేరుకుంది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ జోటస్ర, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వందలాదిగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా రాహుల్ పాదయాత్రలో భాగంగా ఝాలావర్ నగరంలో బిజెపి కార్యాలయం దాటుతుండగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
బిజెపి కార్యాలయం పైన దాబా మీదకు చేరి తన పాదయత్రను తిలకిస్తున్న ఆ పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ముద్దులు విసురుతూ ముందుకు కదలడం పలువురి దృష్టిని ఆకర్షించింది. ‘జై సియారామ్’..‘హే రామ్’ నామాలు ఎందుకు జపించడం లేదంటూ ఆర్ఎస్ఎస్, బిజెపి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించిన ఒక రోజు అనంతరమే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనించదగ్గ విషయం.



