- ఎన్డిఎస్ఏ సూచనల కొనసాగుతున్న తాత్కాలిక మరమ్మతు పనులు
- గత ప్రభుత్వం కమిషన్ల కోసం చూస్తే సీరియస్గా పని చేస్తున్న మా ప్రభుత్వం
- జ్యుడీషియల్ ఎంక్వయిరీ తర్వాత దోషులకు శిక్ష
- సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి ఉత్తమ్
- హెలికాప్టర్ ద్వారా బ్యారేజీలలో జరుగుతున్న మరమ్మత్తు పనుల పరిశీలన
- గేట్లు ఎత్తి ఉంచాలని సూచించిన ఎన్డిఎస్ఏ : ఎల్ అండ్ టి ఇంజనీరింగ్ చీఫ్
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 7 : కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పెద్దపల్లి జిల్లా సుందిళ్ళ వద్ద పార్వతి బ్యారేజ్ను సందర్శించి అక్కడి నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారంకు హెలిక్యాపార్ట్ ద్వారా చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే స్వాగతం పలికారు. అక్కడి నుండి సరస్వతి బ్యారేజ్ చేరుకొని గ్రౌటింగ్ పనులు, సీసీ బ్లాక్స్ అమరుస్తున్న విధానాన్ని పరిశీలించి ఇరిగేషన్ ఈఈని పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డుకు చేరుకుని ఎల్అండ్టి విశ్రాంతిలో భవనంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
అనంతరం బ్యారేజి దిగువకు చేరుకుని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. మొదటగా 17, 20 నంబర్ పిల్లర్లు వద్ద గల గేట్లను పరిశీలించి అక్కడి నుండి 20వ నెంబరు పిల్లరు వద్ద పగుళ్లు ఏర్పడ్డ ప్రాంతాన్ని పరిశీలించి పగుళ్లు ఏవిధంగా పూడ్చుతున్నారని, జరుగుతున్న పనుల వివరాలను ఎల్ అండ్ టి ఇంజనీర్లని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ… నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఎ) కమిటీ సిఫార్సుల మేరకు వర్షాకాలంలో నీటిని ఎగువకు ఎత్తిపోసేందుకు కుంగిన బ్యారేజీలలో జరుగుతున్న మరమ్మత్తుల పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పటి వరకు జరుగుతున్న పనులను ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించారని, బ్యారేజీలలో జరుగుతున్న మరమ్మత్తుల పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. బ్యారేజిల వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందని, అన్నారం ప్రాజెక్ట్లో 60 శాతం పనులు, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో 80 శాతం మరమ్మత్తు పనులు పూర్తి కావచ్చాయని, సుందిళ్ళలో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయని, అక్కడ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు నత్త నడకపై ఈ సందర్భంగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు రాక ముందే పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి గత ప్రభుత్వం 94 వేల కోట్ల ఖర్చు చేస్తే కేవలం లక్ష ఎకరాల ఆయకట్టుకు మాత్రమే తయారైందని, అది కూడా ఇప్పుడు కుంగుబాటుకు గురైందని,కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మూడు బ్యారేజీలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన 94 వేల కోట్ల రూపాయలకు వడ్డీ కడుతున్నామని అన్నారు. డిసెంబర్ 7న తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని, ప్రాజెక్టుపై అనుభవం ఉన్న డ్యామ్ సేఫ్టీ అధికారులను సంప్రదించి చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి పలు సూచనలు తీసుకున్నామని అన్నారు. అందులో మూడు బ్లాకుల గేట్లు ఎత్తి ఉంచాలని అలా ఉంచితే బ్యారేజీకి నష్టం వాటిల్లదని చెప్పడం జరిగిందని, కొన్ని ఇంటర్ మెజర్స్ సూచించారని, ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సూచనల మేరకు మేడిగడ్డ బ్యారేజ్ను నిర్మాణ సంస్థ అయిన ఎల్అండ్టి, అన్నారంను ఆఫ్రాన్ కన్స్ట్రక్షన్స్, సుందిళ్ల బ్యారేజీని నవయుగ కంపెనీతో మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై జ్యుడీషియల్ విచారణ నడుస్తుందని, ప్రస్తుతం బ్యారేజ్ మరమ్మత్తు పనులను తాము కొనసాగిస్తున్నామన్నారు. గతంలో విజిలెన్స్ ఎంక్వయిరీ జరిగిందని విజిలెన్స్ ఎంక్వయిరీలో వొచ్చిన నివేదిక ప్రకారం మాజీ ఇరిగేషన్ ఇంజినోర్ ఇన్ చీఫ్ను విధుల నుండి తప్పించామని,
జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులకు శిక్ష తప్పదని అన్నారు. 94 వేల కోట్ల అప్పుతో ప్రాజెక్టు కట్టి లక్ష ఎకరాల ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని, పాలమూరు రంగారెడ్డికి 23,500 కోట్లు పెట్టి ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని, సీతారామ ప్రాజెక్టుకు 7 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరా ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని అన్నారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం ఆశపడ్డారే తప్ప సిరియస్గా ఏ ఒక్క పని జరగలేదని అన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తుమ్మిడి హట్టి దగ్గర 38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిపిఆర్ సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లే 10 వేల కోట్ల వొస్తుందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన పని లక్షల కోట్లు ఖర్చుపెట్టి కమిషన్లు తీసుకున్నారని అన్నారు. రాబోయే నాలుగున్నర సంవత్సరాలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు సాగులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని గత ప్రభుత్వ నాయకులు తెలిపారని, తాము అధికారంలోకి వొచ్చిన తర్వాత కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిస్తే అసలు జాతీయ హోదా కోసం వారు దరఖాస్తు చేయలేదని అన్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరితే 60 శాతం నిధులు కేంద్రం నుండి కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. తుమ్మిడి హట్టి నుండి ఎల్లంపల్లి వరకు గతంలోనే డిజైన్ చేశామని డిపిఆర్ ప్రకారం పనులు పూర్తి చేస్తామని ఆ విషయాన్ని తాము మ్యాని ఫెస్టోలో కూడా ప్రకటించినట్లు మంత్రి గుర్తు చేశారు.
గేట్లు ఎత్తి ఉంచాలని సూచించిన ఎన్డిఎస్ఏ : ఎల్ అండ్ టి ఇంజనీరింగ్ చీఫ్
ఎన్డిఎస్ఏ కమిటీ సూచనల మేరకు జిఆర్పి టెస్ట్, ఈఆర్పి టెస్ట్, స్కైండ్ ఫైల్స్, ఇంటిగ్రెటిసిటీ చేయమన్నారని, గేట్లు ఎత్తి ఉంచాలని తెలిపారని ఎల్అండ్టి ఇంజనీర్ అన్నారు. మేడిగడ్డలో, అన్నారంలలో పనులు నడుస్తున్నాయని సుందిళ్లలో పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వరదలు వొస్తే 5 మీటర్ల ఎత్తులో జియోట్యూబ్లు ఏర్పాటు చేస్తే నీటిని ఎత్తిపోయొచ్చునని, అన్నారంలో 11మీటర్లు నీటిని ఆపితే ఎత్తిపోయొవచ్చునని, సుందిళ్లలో 9 మీటర్లు ఆపితే ఎత్తి పొయొచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పి కిరణ్ ఖరే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రామగుండం, భూపాలపల్లి శాసనసభ్యులు మక్కన్ సింగ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణ, ఓ అండ్ జనరల్ అనిల్ కుమార్,ఓ అండ్ ఎం పరిపాలన నాగేందర్, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటరెడ్డి, ఈ ఈ తిరుపతి రావు, ఎల్ అండ్టి, అస్కాన్, నవయుగ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





