మైనంపల్లిపై వేటు తప్పదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై వేటుకు రంగం సిద్దం అయ్యింది. మంత్రి కెటిఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యమని తెలుస్తోంది. అలాగే మల్కాజిగిరి సీటును మరొకరికి కేటాయించనున్నారు. బీఆర్‌ఎస్‌ ‌తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్‌ ‌కేటాయించాల్సిందే.. లేకుంటే తానేంటో చూపిస్తానన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై వేటుకు రంగం సిద్ధమైంది. తన కుమారుడికి టికెట్‌ ‌కేటాయించాలని అడగటం వరకూ సబబే కానీ మంత్రి హరీష్‌రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఆగ్రహం తెప్పించాయి.

దీనిపై వెంటనే మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అలాగే మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు నిరసనలకు దిగారు. దీంతో మైనంపల్లిని పార్టీ నుండి సస్పెండ్‌ ‌చేయాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మల్కాజ్‌గిరి అభ్యర్థిని మార్చాలని సైతం బీఆర్‌ఎస్‌ ‌నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ శంభీపూర్‌ ‌రాజును మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి హరీష్‌ ‌రావుతో శంభీపూర్‌ ‌రాజు భేటి అయ్యారు. 4 పెండింగ్‌ ‌సీట్లతో పాటు మల్కాజిగిరికి ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. జనగామ-పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, నర్సాపూర్‌-‌సునీత లక్ష్మారెడ్డి, నాంపల్లి-ఆనంద్‌ ‌గౌడ్‌, ‌గోషామహల్‌-‌నందకిషోర్‌ ‌వ్యాస్‌లను బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *