ప్రజలందరూ పాల్గొనాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9 : గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల దాహార్తిని సొమ్ము చేసుకొని నీళ్లమాటున ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో నిధులను దుర్వినియోగం చేసిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం తెలంగాణ పాలిట శనేశ్వరంగా తయారయిందని, ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు – బిఆర్ఎస్ అబద్దాలు – కాగ్ వెల్లడిరచిన వాస్తవాల పై ఆదివారం ఉదయం 10గంటలకు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే బహిరంగ చర్చలో ప్రజలు పాల్గొనాలని శనివారం కోదండరాం ఒక ప్రటనలో పిలుపునిచ్చారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ మొత్తం 87.440.5 కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అధిక వడ్డీలతో అడ్డగోలుగా అప్పు చేసిందని, దీనిపై ఏటా 7:8 శాతం నుండి 10.9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉందని తెలిపారు. కాళేశ్వరం కుంభకోణంపై నిజానిజాలు తెలుసుకునేందుకు అందరూ చర్చకు రావాలని కోదండరాం కోరారు.




