- బీజేపీని గెలిపించాలని పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపు
- రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీక్షకు సంఘీభావం
తుంగతుర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, మర్డర్లు జరుగుతున్నాయని ఇక్కడికి రాగానే కార్యకర్తలు తనకు చెప్పారని రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం తుంగతుర్తి నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..ఇది ఒక తుంగతుర్తికే పరిమితం కాదని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని, దీనికి పరిష్కారం చెప్పే బాధ్యత బీజేపీ కార్యకర్తల చేతుల్లో ఉందన్నారు. బిజెపికి అవకాశం ఇస్తే ఈ దుర్మార్గాలకు చెక్ పెడతామని అన్నారు. కెసిఆర్ వొచ్చాక మహిళా సంఘాలలో కళలేదని, నాలుగున్నర సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలకు ఇవ్వాల్సిన 4500 కోట్ల రూపాయలు బకాయి పెట్టాడని అన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే మొత్తం డబ్బులు ఇస్తామని రాజేందర్ హామీ ఇచ్చారు. 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఈటల అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 9 వేల చొప్పున 18 వేల రూపాయలు అందిస్తున్నారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చేది 10 వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 18 వేల రూపాయలు..రైతుబంధు పేరు చెప్పి అన్ని సబ్సిడీలను కెసిఆర్ ఎత్తివేశారని, వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు బిజెపి వొచ్చాక ఇవ్వమని, కౌలు రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భార్యాభర్తలు ఇద్దరికీ వృద్ధాప్య పింఛన్ అందిస్తామని హామీ ఇస్తూ..కెసిఆర్ ఇచ్చే పథకాలు బిఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప నిజమైన అర్హులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. దళితబంధు వారి నాయకులకే ఇచ్చుకుంటున్నారని, ఇక్కడ యువకుల ఉత్సాహం, ఆక్రోషం చూస్తుంటే కేసీఆర్ పార్టీని బొంద పెడతారని తనకు విశ్వాసం ఉందని, వారే కథానాయకులుగా ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కేసిఆర్ చేస్తున్న అన్యాయాలను తెలియచెప్పాలన్నారు. తుంగతుర్తి గడ్డమీద ఎగిరేది కాషాయ జెండానే అని పేర్కొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీక్షకు సంఘీభావం
గురువారం ఉదయం నిరుద్యోగులకు అండగా…బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్షకు బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాదుతూ..ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలో పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా యావత్ తెలంగాణ జాతి కదిలిందని, తెలంగాణ శ్రేయస్సు కోరి ప్రొ .
జయశంకర్ లాంటి వారు తెలంగాణ స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారన్నారు. విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు ప్రాణాలు తెగించి పోరాడారని, శ్రీకాంతాచారి నుంచి మొదలు యాదిరెడ్డి లాంటివారు అనేకమంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారని పేర్కొంటూ..నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో బీజేపీ పోరాడుతుందని, ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈటల డిమాండ్ చేసారు.




