మహిళల పట్ల చిన్నచూపు సరైంది కాదు

  • లింగవివక్ష లేకుండా తల్లిదండ్రులు పిల్లలను తీర్చిదిద్దాలి
  • బాల్యం నుంచే సంస్కారం నేర్పాలి
  • మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
  • విద్యార్థులకు వాల్యూ ఎడ్యుకేషన్‌ అం‌దించాలి
  • కేశవ మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • పాల్గొన్న గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ‌సమాజంలో మహిళలను చిన్న చూపు చూడకూడదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహిళలు, పురుషులు అందరూ సమానమే అని చెప్పారు. అర్ధ నారీశ్వరుడు లాగా మహిళ, పురుషుడు ఇద్దరు సమానమే అని చెప్పారు. విద్యార్థులకు, చిన్న పిల్లలకు బాల్యం నుంచే సంస్కారం నేర్పించాలన్నారు. పిల్లలకు చిన్నా, పెద్ద, మహిళల పట్ల ఎలా ఉండాలో తల్లిదండ్రులు నేర్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. నారాయణగూడలోని కేశవ్‌ ‌మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన ఆమె..విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. విద్యార్థులకు వాల్యూ ఎడ్యుకేషన్‌ను అందించాలని ద్రౌపది ముర్ము సూచించారు.

విద్యార్థులు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు వెళ్ళాలన్నారు. వందల, వేల కోట్లు ఉన్న ఏమి లాభం లేదని…..తినేది రెండు చపాతీలు, 6 గజాల స్థలంలోనే పడుకుంటారన్న ఆమె..మనిషికి ఆత్మ సంతృప్తి ముఖ్యమన్నారు. మన సంస్కృతి మనకు గర్వకారణమన్నారు. మన మూలాలు మర్చిపోవద్దని, కాపాడుకోవాలని అన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. మనిషికి మనిషికి మధ్య ఆరోగ్య కరమైన పోటీ ఉండాలని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. కేశవ్‌ ‌మెమోరియల్‌ ‌విద్యాసంస్థల సేవలు ప్రశంసనీయమని గవర్నర్‌ ‌తమిళి సై అన్నారు. విద్యార్థులు దేశం కోసం పనిచేయాలని ఆమె చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవాలని అన్నారు. తాము చదువుకున్న రోజుల్లో రాష్ట్రపతి ఎవరన్నది పుస్తకాల్లో చదివి తెలుసుకునే వాళ్లమని.. ఇప్పుడు వి•రంతా రాష్ట్రపతిని దగ్గరగా చూస్తున్నారని అన్నారు. సెక్యురిటీని కూడా పక్కన పెట్టి..గిరిజనుల దగ్గరకు వెళ్లి వారి గురించి తెలుసుకున్న రాష్ట్రపతి ముర్ము అందరికీ ఆదర్శనీయమని గవర్నర్‌ ‌తమిళిసై ప్రశంసించారు.

కేశవ్‌ ‌మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి గవర్నర్‌ ‌తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆమె పలు సూచనలు చేశారు. పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించాలని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి సూచించారు. అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగం వల్లే కుగ్రామం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారని అన్నారు. పటేల్‌ ‌తీసుకున్న నిర్ణయం వల్ల స్వాతంత్య్రం వొచ్చిందన్న ఆయన..విశ్వగురు స్థానంలోకి వెళ్లేలా విద్యార్థుల ఆలోచనలు ఉండాలని చెప్పారు. 2047కల్లా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని.. దేశాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామం కావాలని కిషన్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణగూడలోని కేశవ్‌ ‌మెయోరియల్‌ ‌స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్పుతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటనతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం హైదరబాద్‌ ‌విడిదికి వొచ్చిన ముర్ము ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *