మరో పదేళ్లు సిఎంగా ఉంటా

  • ప్రజలు ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యమే
  • అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకు?
  • నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు…సమస్యను పరిష్కరిస్తాం
  • పోలీస్‌ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మరో పదేళ్లపాటు అధికారంలో ఉంటానని..ప్రజలు ఆశీర్వదిస్తే ఇక ఇందిరమ్మ రాజ్యమేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి మళ్లీ వొస్తానంటున్నారని, తాను ఇక్కడే ఉంటా.. ఎలా వొస్తారో చూస్తానని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం 15,750 మంది అభ్యర్థులకు పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పత్రాలు అందజేశారు. ప్రక్రియ పూర్తైన అభ్యర్థుల నియామకాలకు హైకోర్టు ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సీఎంగా మరో పదేళ్లు తానే ఉంటానంటూ పేర్కొన్నారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తామంటున్నారని..అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకంటూ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీకి రావడానికి కేసీఆర్‌కి ధైర్యం లేదని.. కానీ నల్గొండ పోయి మాట్లాడుతున్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు. పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతును తెచ్చుకున్నారని కేసిఆర్‌ అంటున్నారని, మంగళవారం అసెంబ్లీలో అటెండర్‌ రేసు గుర్రం వొచ్చిందని చెప్పాడంటూ కౌంటర్‌ ఇచ్చారు. చచ్చిన పామును చంపే అలవాటు తమకు లేదన్నారు. 10 ఏళ్ల క్రిందట కేసిఆర్‌ పెట్టిన సంతకాలు ఇప్పుడు గుదిబండగా మారాయని.. అడ్డా మీద కొట్లడటం కాదు చట్ట సభలోకి రావాలంటూ రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్స్‌కు రేవంత్‌ రెడ్డి కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో గంజాయిని మాట వినిపించకుడదని..ఉక్కుపాదం మోపాలంటూ పిలుపునిచ్చారు.

డిసెంబర్‌ 7న ఇదే వేదికలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధి సమక్షంలో ప్రమాణం చేసినపుడు ఎంత ఆనందం కలిగిందో.. నియామక పత్రాలు అందిస్తుంటే.. అంతకంటే ఎక్కువ ఆనందంగా కలిగిందంటూ వ్యాఖ్యానించారు. తమకు కుటుంబం అంటే తెలంగాణ ప్రజలని..పరీక్షలు రాసి ఎదురుచూసి నిరాశకు గురైన వారికి అండగా ఉండాలని కాంగ్రెస్‌ భావించిందన్నారు. 2014 లో రాష్ట్రం వొచ్చాక నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వొస్తాయని భావించారని..అలా రాలేదనన్నారు. గత ప్రభుత్వం వారి కుటుంబం గురించే ఆలోచించిందని.. న్యాయస్థానాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించే అవగాహన గత ప్రభుత్వ పెద్దలకు లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక అందరి సమస్యలపై దృష్టి పెట్టామని.. అందరికీ తాను అండగా ఉంటానని.. ఎలాంటి సమస్యా రానియ్యనంటూ పేర్కొన్నారు. స్టాప్‌ నర్స్‌, సింగరేణి ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చాం.. నేడు కానిస్టేబుల్‌ నియామకాల పత్రాలు ఇస్తున్నాం.. నిరుద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *